శంషాబాద్ రూరల్, జనవరి 5: ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కార్యక్రమాలు చేపడుతున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. గురువారం శంషాబాద్ మండలంలోని కవ్వగూడ గ్రామంలో మండల స్థాయి బోధన అభ్యాసన సామగ్రి మేళా నిర్వహించారు. మండలంలోని 57 పాఠశాల నుంచి విద్యార్థులు, ఉప్యాయులు పాల్గొని 1350 మోడల్స్ను ప్రదర్శించారు. ఈ మేళాకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పాల్గొని మోడల్స్ ఏర్పాటు చేసిన స్టాల్స్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేసి విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మాకమైన విద్యనందించి ఉత్తమ పౌరులుగా తీర్చడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ‘మన ఊరు- మనబడి’ పేరుతో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలను మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులతో పాఠశాలకు సరిగా రాకపోయేవారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన నుంచి విద్యశాఖలో అనేక మార్పులు తీసుకువచ్చిన ప్రైవేటు పాఠశాలకు దీటుగా పది, ఇంటర్మీడియట్లో మార్కులు సాధిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల నూతన భవనాలకు నిధులు మంజూరు చేయడంతో పాటు లైబ్రరీలు, ల్యాబ్లు ఏర్పాట్లు చేసి విద్యార్థులకు సైన్స్పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులకు ఉన్న విజ్ఞానానికి సృజనాత్మకతతోడైతే మారుమూల పాఠశాలలో విద్యార్థులతో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని అన్నారు.
ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ తన్విరాజులు మాట్లాడుతూ విద్యతోనే ఏదైనా సాధించవచ్చునని అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో రాంరెడ్డి, గ్రామ సర్పంచ్ రమేశ్యాదవ్, ఎంపీడీవో వసంతలక్ష్మీ, వైస్ ఎంపీపీ నీలంనాయక్, ఎన్ఎంసీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు బుర్కుంట సతీశ్, దవాణాకర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు కే చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.