సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్కు దీటుగా జిల్లాలోని సర్కారు బడులను అభివృద్ధి చేసేందుకు అనుగుణంగా మన బస్తీ-మన బడి కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు.. సర్కారు బడుల్లో చదువుతున్న పేద, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించడంతో పాటు పాఠశాలలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లాలో ‘మన బస్తీ-మన బడి’కి 239 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి. వాటిలో రూ.40 లక్షలకు పైగా అభివృద్ధి పనులు చేసేందుకు 41 స్కూళ్లు ఎంపికవగా, రూ.30 లక్షల లోపు పనులు చేసేందుకు 158 పాఠశాలలు ఎంపికైనట్లు జిల్లా విద్యాధికారి ఆర్ రోహిణి తెలిపారు.
ప్రస్తుతం 132 సర్కారు బడుల్లో అభివృద్ధి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. మరో 26 పాఠశాలల్లో ఇంకా అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదని, త్వరలోనే పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
విద్యుత్, అదనంగా ఫ్యాన్లు, భవనాలకు అవసరమైన మరమ్మతులతో పాటు బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, తగిన నీటి సదుపాయాలు కల్పించనున్నారు. అలాగే ప్రతి ప్రభుత్వ పాఠశాలను చూడగానే అందంగా కనపడేలా మంచి పెయింటింగ్ చిత్రాలు, ప్రహరీ గోడలపై దేశభక్తి, విద్యాబోధనకు సంబంధించిన సూక్తులు, పరిసరాల పరిశుభ్రత, గ్రీనరీకి మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.