వెంగళరావునగర్, సెప్టెంబర్ 28: పంపిన డబ్బు చేరక పోవడంతో.. డబ్బు రీఫండ్ కోసం కస్టమర్ కేర్ను అభ్యర్థించిన ఓ యువకుడి ఖాతా నుంచి సైబర్ చోరులు నగదు కాజేశారు. ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. ఎల్లారెడ్డిగూడలోని హాస్టల్లో ఉంటున్న యు.శ్రీనివాసరావు తన క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపాడు. అయితే, షాపు యజమానికి నగదు చేరలేదు. దీంతో నగదు రీఫండ్ చేయమని అభ్యర్థించడం కోసం శ్రీనివాసరావు ఆన్లైన్లో వెతికి గూగుల్ (నకిలీ) కస్టమర్ కేర్ నంబర్ను సంప్రదించాడు.
సైబర్ చోరులు ఓ లింకును పంపి.. క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేయమన్నారు. వివరాలు నమోదు చేసిన శ్రీనివాస్రావు అనంతరం ఓటీపీని కూడా చెప్పాడు. ఓటీపీ చెప్పగానే క్రెడిట్ కార్డు ఖాతా నుంచి రూ.95 వేలు గల్లంతయ్యాయి. మోసపోయినట్లు ఆలస్యంగా గ్రహించిన బాధితుడు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.