హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణం జరిగింది. మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తి అన్నను బండరాయితో కొట్టి చంపేశాడు. చాంద్రాయణగుట్ట ఇందిరానగర్ బస్తీకి చెందిన గుమ్మడి ఆంజనేయులు, సురేశ్కుమార్ అన్నదమ్ములు. ఆంజనేయులు భార్య ఇంటి ముందు కట్టెల పొయ్యిపై నీళ్లు వేడి చేస్తున్నది. పొగవల్ల కళ్లు మండుతున్నాయని సురేశ్కుమార్ ఆమెతో గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా ఆమెపై చేయి చేసుకున్నాడు.
అయితే తన భార్యపై ఎందుకు చేయిచేసుకున్నావని తమ్ముడిని ఆంజనేయులు నిలదీశాడు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఆంజనేయులు కింద పడిపోయాడు. పక్కనే ఉన్న బండరాయి ఎత్తి అన్న తలపై వేయడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడి మానసికస్థితి సరిగా లేదని, జులాయిగా తిరుగుతుంటాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.