కొండాపూర్, ఆగస్టు 23 : అభివృద్ధి పనులు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. చందానగర్లోని గౌతమీనగర్ కాలనీలో రోడ్డు పనుల పేరుతో కంకర, నిర్మాణ సామగ్రిని రోడ్డుపైనే కుప్పలుగా వేసి, కనీస భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో ఓ నిండు ప్రాణం బలైంది. రోడ్డు పనుల కోసం వేసిన కంకరపై జారిపడి తీవ్రంగా గాయపడిన ఒంగోలుకు చెందిన శ్రీనివాసరావు (50), చికిత్స పొందుతూ మృతి చెందారు.
స్థానికుల వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం శ్రీనివాసరావు కాలనీలో నడుచుకుంటూ వెళ్తుండగా రోడ్డుపై ఉన్న కంకరపై జారి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే స్పృహ కోల్పోగా, కాలనీవాసుల సమాచారంతో 108 సిబ్బంది ఆయనను కొండాపూర్ ఏరియా దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఎన్నికల వేళ హడావిడిగా శంకుస్థాపన..
ఎన్నికల ముందు హడావుడిగా రోడ్డు పనులకు ఫౌండేషన్ వేసి, అనంతరం ఆరు నెలలుగా పనులను పూర్తి చేయకుండా వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్లను తవ్వి, కంకర మెటీరియల్ను రోడ్డుపైనే కుప్పలుగా వేసి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి ప్రాణం పోయిన తర్వాతైనా అధికారులు కళ్లు తెరుస్తారా? అంటూ కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతంలో కనీసం హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు, రక్షణ చర్యలు ఏర్పాటు చేయకపోవడం ఎవరి నిర్లక్ష్యమని నిలదీస్తున్నారు.
సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా పనుల్లో వేగం కనిపించడం లేదంటున్నారు.
ప్రజల భద్రతను పక్కనపెట్టి అభివృద్ధి పనుల పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని మండిపడుతున్నారు. శ్రీనివాసరావు మృతికి బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్ను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రోడ్డు పనులు ఎప్పుడు పూర్తవుతాయి? ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఈ ఘటనకు బాధ్యులెవరు? అనే ప్రశ్నలు ఇప్పుడు గౌతమీనగర్ కాలనీలో తీవ్రంగా వినిపిస్తున్నాయి. మరో ప్రాణం బలయ్యే వరకు అధికారులు వేచి చూడకుండా తక్షణమే రోడ్డు పనులను పూర్తి చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.