హైదరాబాద్: హైదరాబాద్లోని (Hyderabad) మూసాపేటలో నిర్మాణంలో ఉన్న ఇల్లు కూల్చివేత పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతిచెందాడు. మూసాపేటలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ తన పాత ఇంటిని బుధవారం కూల్చివేశారు. దానికి ముందురోజే ఆ ఇంటిలో కిరాయికి ఉంటున్న వారందని ఖాళీ చేయించారు. ఉదయం పాక్షికంగా పనులు చేపట్టగా.. మధ్యాహ్నం తర్వాత పూర్తిగా కూల్చివేశారు.
అయితే స్వామిరెడ్డి అనే యువకుడు ఆ ఇంట్లో కిరాయికి ఉండేవారు. మద్యమత్తులో ఖాళీ చేయించిన ఇంటికి వచ్చి లోపల నిద్రపోయాడు. ఆ విషయం తెలియకుండా పూర్తిగా కూల్చివేయడంతో స్వామిరెడ్డి శిథిలాల కింద చిక్కుకుని మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.