బంజారాహిల్స్,జనవరి 2: రోజంతా మద్యం(Alcohol )తాగుతుండడంతో పాటు సహజీవనం చేస్తున్న మహిళతో గొడవపడిన ఓ వ్యక్తి ఆత్యహత్యకు(Commits suicide) పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని కాకినాడ ప్రాంతానికి చెందిన ధర్మ(35) అనే వ్యక్తి సినిమా షూటింగ్స్లో ఆర్ట్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తుంటాడు. భార్యతో గొడవపడి వేరుగా ఉంటున్న ధర్మకు నాలుగేళ్ల క్రితం మల్లమ్మ(39) అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి వారిద్దరూ కలిసి ఇందిరానగర్లో గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు.
కాగా, బుధవారం నూతన సంవత్సరం కావడంతో ఫ్రెండ్స్తో రోజంతా మద్యం సేవించిన ధర్మ సాయంత్రం ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత రాత్రి ఏడున్నర ప్రాంతంలో మరోసారి మద్యం తెచ్చుకుని దూరపు బంధువయిన దుర్గ అనే వ్యక్తితో కూర్చుని తాగుతున్నాడు. అయితే రోజంతా తాగేసి వచ్చావు.. మళ్లీ ఎందుకు తాగుతున్నావంటూ మల్లమ్మ ప్రశ్నించింది. దాంతో వారిద్దరి మద్యన గొడవ జరిగింది. అంతటితో ఆగకుండా మల్లమ్మకు వేరే వాళ్లతో సంబంధం ఉందంటూ ఆమెపై దాడి చేశాడు.
వీరిద్దరి గొడవ చూసిన దుర్గ అడ్డుకోగా అతడిపై కూడా చేయి చేసుకోవడంతో అక్కడినుంచి వెళ్లిపోయాడు. రాత్రి పదిన్నర ప్రాంతంలో మరోసారి మల్లమ్మపై దాడి చేయడంతో పాటు ఇంట్లోంచి బయటకు తరిమి వేశాడు. దీంతో అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో ఇంటినుంచి బయటకు వచ్చి సుమారు గంటసేపు ఆమె బయటనే కూర్చుంది. కోపం తగ్గి ఉండవచ్చనుకుని ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా తలుపులు వేసుకున్నట్లు తేలింది. తలుపు సందులో నుంచి చూడగా ఫ్యాన్కు చీరతో ఉరేసుకున్న ధర్మ కనిపించాడు.
దీంతో గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే ధర్మ మృతి చెందినట్లు తేలింది. ఈ మేరకు సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.