నిందితుడు అరెస్టు, పరారీలో ప్రధాన సూత్రధారి
సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ) : ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసిన నేరగాడిని బుధవారం హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన అజిత్సింగ్ అదే ప్రాంతంలో కెరీర్ 360 పేరుతో కార్పొరేట్ను తలపించే కార్యాలయాన్ని స్థాపించాడు. నీట్ పరీక్ష రాసిన అభ్యర్థులకు సంబంధించిన డేటాను సేకరించి వారికి ఫోన్ చేసి ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నాడు.
ఈ క్రమంలో బీహార్కు చెందిన అశోక్ పరిచయమయ్యాడు. 10వ తరగతి వరకు చదువుకున్న అశోక్కు ట్రైనింగ్ ఇచ్చాడు. హైదరాబాద్కు చెందిన ఓ ఇంటర్మీడియట్ విద్యార్థినికి ఫోన్, మెసేజ్ పంపిన అశోక్ బెంగళూరు కిమ్స్లో మెడికల్ సీటు ఇప్పిస్తామని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన విద్యార్థిని కుటుంబం బెంగళూరులోని కెరీర్ 360 కార్యాలయాన్ని సైతం సందర్శించారు. అక్కడి హంగూ ఆర్భాటాలు చూసి అశోక్ చెప్పిన ఖాతాల్లోకి రూ.10.16 లక్షలు బదిలీ చేశారు. అప్పటి నుంచి వారి ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయి. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని అశోక్ను అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారి అజిత్సింగ్ పరారీలో ఉన్నాడు. ఈ సమావేశంలో సీసీఎస్ ఏసీపీ కేవీఎం ప్రసాద్, ఇన్స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.