సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ): అసభ్యకర రీతిలో ప్రముఖుల ఫొటోలు మార్ఫింగ్ చేసి, వాటితో వీడియోలు రూపొందించి సోషల్మీడియాలో తెలంగాణ గళం పేరుతో సర్క్యులేట్ చేసి సైబర్క్రైమ్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన కాంగ్రెస్ పార్టీ టాస్క్ఫోర్స్ సభ్యుడు సునీల్ కనుగోలు కేసులో మాజీ ఎంపీ మల్లు రవిని కూడా నిందితుడి(ఏ5)గా చేర్చనున్నారు. ఈ నేపథ్యంలో సైబర్క్రైమ్ పోలీసులు ఈ నెల 12వ తేదీన మల్లు రవిని విచారణకు హాజరుకావాలంటూ సూచించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి మంగళవారం హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులను కలిశారు.
కాగా.. మార్ఫింగ్ ఫొటోలతో దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి, మహిళలతో పాటు ఇతరులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టిన కేసులో తనకు సంబంధం లేదని, దీనంతటికి మల్లు రవి ఇన్చార్జి అంటూ సునీల్.. పోలీసులకు వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే మల్లు రవికి సైబర్క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న విచారణకు హాజరుకావాలని సూచించారు. ఈ క్రమంలోనే మల్లు రవి మంగళవారం బషీర్బాగ్లోని సైబర్క్రైమ్ ఠాణాకు వచ్చారు. నోటీసులు జారీ చేసిన అంశంపై ఏసీపీ కేవీఎం ప్రసాద్, విచారణ అధికారి ఇన్స్పెక్టర్ పద్మతో మాట్లాడారు.
మల్లు రవి రాసిన లేఖపై..
ఈ వ్యవహారంలో అన్నింటికీ తానే బాధ్యుడనని, తనను కూడా ఈ కేసులో చేర్చాలంటూ గతంలో మల్లు రవి సైబర్క్రైమ్ పోలీసులకు లేఖ రాశారు. ఈ విషయాన్ని కూడా పోలీసులు గుర్తు చేశారు. 12న విచారణ ఉన్నదని, ఆ రోజు రావాలంటూ అధికారులు ఆయనకు సూచించారు. ప్రముఖుల ఫొటోలు మార్ఫింగ్ చేసిన కేసులో సునీల్ కనుగోలుతో పాటు మరో ముగ్గురు నిందితులుగా ఉన్నారు. సునీల్ కనుగోలు విచారణలో వెల్లడించిన అంశాలు, తొలుత మల్లు రవి రాసిన లేఖను పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో మల్లు రవిని కూడా (ఏ5) నిందితుడిగా చేర్చనున్నాని తెలిసింది.