మేడ్చల్ రూరల్, నవంబర్ 8 : తెలంగాణ ప్రజలను అన్ని విధాల ఆదుకున్నది సీఎం కేసీఆర్ ఒక్కరేనని, ఇక ముందు కూడా ఆదుకునేది సీఎం కేసీఆరేననే నమ్మకం ప్రజల్లో ఉందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని కండ్లకోయలో బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా వేలాది మందితో మంత్రి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పేద ప్రజలు కష్టాలు పడకూడని, దేశంలో ఎక్కడాలేని పథకాలు తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేశారన్నారు. పుట్టిన పసి పాప నుంచి వృద్ధుల వరకు వివిధ పథకాలు తీసుకొచ్చి ఆర్థికంగా ఆదుకున్నారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఉపాధి అవకాశాలు, వ్యవసాయ రంగానికి ప్రోత్సాహంతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మారిందన్నారు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. మరిచిపోయి కాంగ్రెస్కు ఓటు వేస్తే అది మోరీల వేసినట్టేనని, ఎన్నికలప్పుడు వచ్చి చెప్పే మాయమాటలు నమ్మ మోసపోవద్దని ప్రజలను కోరారు. ఇక్కడ ఎంపీగా గెలిచిన రేవంత్ అనంతరం ఒక్కసారి కూడా ప్రజల వద్దకు వచ్చిన పాపానపోలేదని, పీసీసీ తీసుకుని ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటుండని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడంతో ఆర్థికంగా బలపడి రాబడి పెరిగిందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి, నంబర్ వన్ సిటీగా మార్చారన్నారు. నగరంతోపాటు తెలంగాణలో సంపదను పెంచి, వచ్చిన సంపదను పథకాల ద్వారా పేదలకు పంచారని తెలిపారు. మంత్రికి గ్రామంలో నాయకులు ఘన స్వాగతం పలుకగా, మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రభాకర్ భారీ గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్మన్ లక్ష్మీశ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, కౌన్సిలర్లు మల్లికార్జున్ ముదిరాజ్, జైపాల్రెడ్డి, వీణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.