సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రాంగ్ సైడ్ డ్రైవింగ్తో ప్రమాదాలు జరగడంతో మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు, రాంగ్సైడ్ డ్రైవింగ్ వారానికి పదివేలకుపైగా కేసులు నమోదు చేస్తున్నారు. ఎందుకు ఈ సమస్య వస్తుంది, సమస్యకు మూలాలు ఎక్కడ అనే విషయంపై మాత్రం పోలీసులు ఫోకస్ పెట్టకపోవడం ఆందోళన కల్గిస్తోందంటూ వాహనదారులు వాపోతున్నారు. జరిమనాలు వేయడం ద్వారానే సమస్య పరిష్కారం కాదనే విషయాన్ని పోలీసులు పట్టించుకోవడం లేదని, దీంతోనే కాలనీలు, బస్తీలు తేడా లేకుండా కేసులు రాస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. చాలా ప్రాంతాల్లో యూ టర్న్లు తీసుకొని రోడ్డు దాటాలంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోందని, పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లాలన్నా కిలోమీటర్ల మేర తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఇంధనం ధరలు ఆకాశానంటడం, కొన్ని పశ్చిమాసియా యుద్దంతో ఇంధనం కూడా అప్పుడప్పుడు దొరకని పరిస్థితుల్లో ఆందోళన మొదలవుతుందని, దీంతోనే తప్పని పరిస్థితుల్లో రాంగ్సైడ్ డ్రైవ్ చేయాల్సి వస్తోందంటూ వాహనదారులు తమ అభిప్రాయాలు చెబుతున్నారు.
కారణాలు చెబుతూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే అది ప్రాణాలపైకి వచ్చే అవకాశాలున్నాయి. రాంగ్సైడ్ డ్రైవింగ్లో ఉల్లంఘనకు పాల్పడిన వారితో పాటు సాఫీగా అన్ని నిబంధనలు పాటిస్తూ ఎదురుగా వచ్చే వాహనదారుడికి సైతం ప్రమాదం పొంచి ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిన అవసరం అందరికీ ఉందని, తమ వ్యక్తిగత అభిప్రాయాలకు, ట్రాఫిక్ నిబంధనలకు ముడిపెట్టవద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు. ప్రతి వారం మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలో భారీగా ఉల్లంఘనలు నమోదవుతున్నాయి.
19వ తేదీ నుంచి 25 – 11673
12వ తేదీ నుంచి 18 -10260
5వ తేదీ నుంచి 11 -10420
ప్రత్యేక డ్రైవ్లో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడుపుతున్న వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇటీవల 780 కేసులు నమోదు చేశారు. అందులో ఇద్దరు మైనర్లు కూడా ఉ ండడంతో వారిపై చార్జిషీట్ కోర్టులో దాఖలు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదని, రాంగ్సైడ్ డ్రైవింగ్లో కారణాలు చెప్పి తప్పించుకోవాలని చూడొద్దని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రాంగ్సైడ్ డ్రైవింగ్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్, అనధికారిక సైరన్లు, అతిగా శబ్దం చేసే హారన్ల విషయంలోను ఫోకస్ పెట్టామని మల్కాజిగిరి ట్రాఫిక్ డీసీపీ రాహుల్రెడ్డి తెలిపారు.