సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రాజకీయ ఒత్తిళ్లతో మూడు నెలలకే మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ను బదిలీ చేసినట్లు పోలీస్ డిపార్టుమెంట్లో చర్చించుకుంటున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ను పునర్విభజన చేసి, రాచకొండ పేరును తొలగించిన ప్రభుత్వం, కొత్తగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ను ఏర్పాటు చేసి, మొదటి కమిషనర్గా అవినాశ్ మహంతిని నియమిస్తూ డిసెంబర్ 30న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
పాత, కొత్త కమిషనరేట్ల కలయకతో ఏర్పడ్డ మల్కాజిగిరి కమిషనరేట్లో అప్పటికే పెండింగ్లో ఉన్న ఎన్నో పనులను పూర్తి చేసి, వ్యవస్థను ప్రక్షాళన చేశారు. మల్కాజిగిరిలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక సిస్టమ్ను తయారు చేశారు. ఆయన వచ్చి నాలుగు నెలలు కూడా పూర్తికాలేదు. సుమారు నెల రోజులుగా ఆయనను కేంద్ర ప్రభుత్వం పశ్చిమబెంగాల్ ఎన్నికల అధికారిగా బాధ్యతలు అప్పగించింది.
ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నారు. ఇంతలో శుక్రవారం పోలీసు ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది, అందులో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ పేరు ఉండడంతో అందరూ షాక్కు గురయ్యారు. రాజకీయ ఒత్తిళ్లతోనే కమిషనర్ బదిలీ జరిగిందని పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అవినాశ్ మహంతికి డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్తోపాటు ఏసీబీ డైరెక్టర్గా బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.