మలక్పేట, జూన్ 23 : పట్టపగలు ఇండ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను మలక్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి ఎనిమిదిన్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.2.5 లక్షల నగదును స్వాధీ నం చేసుకున్నారు. గురువారం మలక్పేట పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్జోన్ డీసీపీ చక్రవర్తి సంఘటనకు సంబంధించి వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు సమీపంలోని నయంద హల్లీ గ్రామానికి చెందిన సయ్యద్ ఎజాజ్ అలియాస్ ఇమ్రాన్ వృత్తిరీత్యా డ్రైవర్. వ్యసనాలకు అలవాటుపడి నేర ప్రవృత్తిని వృత్తిగా ఎంచుకొని 2017 నుంచి నేరాలకు పాల్పడటం మొదలెట్టాడు.
2018 నుంచి 2022 మే వరకు నగరానికి మూడుసార్లు వచ్చిన నిందితుడు డబీర్పురా, హుస్సేని ఆలం, ముషీరాబాద్, మలక్పేట పీఎస్ల పరిధిలోని ఐదు దొంగతనాలకు పాల్పడ్డాడు. 2022లో మలక్పేట పీఎస్ పరిధిలో తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డాడు. కాగా, గత నెల 13న మలక్పేట వెంకటాద్రినగర్కు చెందిన సయ్యద్ ఇఫ్తకారుద్దీన్ అత్తగారింటికి వెళ్లి తిరిగి వచ్చే సరికి మెయిన్ డోర్ తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా లాకర్లో దాచిన బంగారు ఆభరణాలు, రూ.లక్షల నగదు దొంగిలించబడటంతో బాధితుడు మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న డీఐ నాను నాయక్, క్రైంటీంను రంగంలోకి దింపారు.
ఆ ప్రాంతంలోని సుమారు 120 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. కాగా బుధవారం దిల్సుఖ్నగర్ రాజీవ్చౌక్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలను అంగీకరించాడు. మలక్పేట ఏసీపీ వెంకటరమణ, సీఐ శ్రీనివాస్, డీఐ నాను నాయక్, క్రైం టీం పాల్గొన్నారు. కాగా ఎలాంటి ఆధారాలు దొరకనప్పటికీ, కేవలం ఫోన్కాల్స్ ఆధారంగా నిందితుడి పట్టుకొని సొత్తును రికవరీ చేసిన డీఐ నాను నాయక్ను, డీఎస్ఐ సాయితేజ రెడ్డి, ఏఎస్ఐ లక్ష్మారెడ్డి, క్రైం టీం సిబ్బంది ఎం.శ్రీనివాసరావు, టి.రాజ్కుమార్, బి.నరేశ్, ఆసిం షరీఫ్, ఎ.మమత, ఎ.ప్రశాంత్కుమార్, జి.మురళీధర్లకు డీసీపీ చక్రవర్తి, ఏసీపీ వెంకటరమణలు క్యాష్ రివార్డులు అందజేసి అభినందించారు