ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అంబేద్కర్ విగ్రహం వద్ద మాలల నిరసన దీక్ష
మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య
కవాడిగూడ, జూలై 3: ఎస్సీల వర్గీకరణకు బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో అనుకూలంగా తీర్మానం చేస్తే దేశమంతటా బీజేపీ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం లోయర్ ట్యాంక్ బండ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడి ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీర్మానం చేస్తే సహించేది లేదని అన్నారు. అసలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానాలు చేశారా..! అని ఆయన ప్రశ్నించారు.
తెలుగు రాష్ర్టాల్లో అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మాల మాదిగల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే జనవరి నెలలో ఎస్సీల వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల శంఖారావం సదస్సును పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం మాల మహానాడు నాయకులు ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు జంగా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మన్నె శ్రీధర్రావు, సహాయ కార్యదర్శి బంగి ఆనంద రావు, మహబూబ్నగర్ అధ్యక్షుడు కావలి రమేశ్, దాసరి సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎడ్ల కృష్ణయ్య, జెట్టి గిరి, కటిక ప్రవీణ్, మహేశ్ పాల్గొన్నారు.