మేడ్చల్, మే 2(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మాదారంలో ఏర్పడనున్న ఇండస్ట్రియల్ పార్క్లో త్వరలో లే అవుట్ పనులను టీఎస్ఐఐసీ ప్రారంభించనున్నది. 196 ఎకరాల భూమిలో టీఎస్ఐఐసీ ఇండస్ట్రియల్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను మేడ్చల్ జిల్లా రెవెన్యూ అధికారులు పూర్తి చేశారు. దీంతో టీఎస్ఐఐసీ అధికారులు భూమిని స్వాధీనం చేసుకుని లే అవుట్ పనులకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు. 196 ఎకరాల భూమిని సేకరించిన అధికారులు రైతులకు రూ. 32 లక్షల చొప్పున రూ. 60 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. లేఅవుట్లో అన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా లే అవుట్ను సిద్ధం చేస్తున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ మాధవి తెలిపారు. మేడ్చల్ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్న నేపథ్యంలో మాదారం ఇండస్ట్రియల్ పార్క్ లేఅవుట్ను త్వరితగతిన పూర్తి చేసేందుకు టీఎస్ఐఐసీ చర్యలు చేపట్టింది.
అధిక పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా లే అవుట్
మాదారం ఇండస్ట్రియల్ పార్క్లో వందలాది సంఖ్యలో పరిశ్రమల ఏర్పాటుకు వీలుండే విధంగా లే అవుట్ను టీఎస్ఐఐసీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. లే అవుట్ ప్లాన్లో అధిక సంఖ్యలో పరిశ్రమలు వచ్చేలా చూస్తున్నారు. జిల్లాలో పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు వేలాది సంఖ్యలో టీఎస్ఐఐసీలో పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక పరిశ్రమలు ఉన్న జిల్లాగా మేడ్చల్ నంబర్వన్ స్థానంలో ఉన్నది. పరిశ్రమలలో తయారయ్యే ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు సౌకర్యంగా ఉన్న మేడ్చల్ జిల్లాలో పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. పారిశ్రామిక పెట్టుబడి ప్రోత్సాహక విధానం, పెట్టుబడి రాయితీ, పావలా వడ్డీ రాయితీ, విద్యుత్ చార్జీల రాయితీలను బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న నేపథ్యంలో పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
ప్రభుత్వ స్థలాల గుర్తింపు
పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా, రవాణా సౌకర్యం ఉన్న ప్రభుత్వ భూములను టీఎస్ఐఐసీ అధికారులు గుర్తిస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉన్నట్లు నిర్ధారణ అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను టీఎస్ఐఐసీకి అప్పగించే పక్రియను చేపట్టనున్నారు. ఇటీవలే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ ప్రభుత్వ భూముల గుర్తింపుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.