బంజారాహిల్స్, జనవరి 17: తెలుగు సినీ పరిశ్రమకు ఆద్యు డు ఎల్వీ.ప్రసాద్ జయంతి సందర్భంగా సినీనటుడు నందమూరి బాలకృష్ణకు ప్రముఖ సాంస్కృతిక సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ పురస్కారాన్ని మంగళవారం ప్రదానం చేశారు. బంజారాహిల్స్లోని ప్రసాద్ ఫిలిం ల్యాబ్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కేవీ రమణాచారి, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్లు బాలకృష్ణకు అవార్డును అందజేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. స్వశక్తితో అత్యున్నత స్థాయికి ఎదిగిన మహనీయులు ఎల్వీ. ప్రసాద్ అని కొనియాడారు. తన తండ్రి ఎన్టీఆర్కు మనదేశం సినిమా ద్వారా తొలి అవకాశం ఇచ్చారని, ఆయన పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కేవీ రమణాచారి మాట్లాడుతూ.. ఎల్వీ ప్రసాద్ సినీరంగంలో ఎంతోమందిని పరిచయం చేశారని, తాను సంపాదించిన సొమ్మును మొత్తం ప్రజలకోసమే ఖర్చు పెట్టి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్ తనయుడు రమేశ్ ప్రసాద్, మురళీమోహన్, బండారు సుబ్బారావు,ఆకృతి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.