హైదరాబాద్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కొత్త జోనల్ విధానం ద్వారా ప్రతి ప్రాంతంలో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కుతాయని హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని బీఆర్కే భవన్లో సీఎస్ సోమేశ్ కుమార్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న సీనియారిటీ గొడవలన్నీ ఇక ముందు రాకుండా, జూనియర్ల కింద సీనియర్లు పనిచేయకుండా ఇటీవల తీసుకొచ్చిన కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు. డీఈఈ క్యాడర్ని స్టేట్ క్యాడర్గా చేసి అన్ని డిపార్ట్మెంట్ల ఇంజినీర్ల చిరకాల వాంఛను నెరవేర్చారని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కొత్త జోనల్ విధానం ప్రకారం, ప్రస్తుతం ఉద్యోగుల సర్దుబాటు పూర్తికాగానే, కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రతి శాఖలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో తెలుస్తుందని, కొత్త ఇంజినీర్ల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశముంటుందని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు తన్నీరు వెంకటేశం, మహేందర్, అధ్యక్షుడు ఏఎస్ఎన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చక్రధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.రవీందర్, కోశాధికారి శ్రీనివాస్రెడ్డి, రమ, పాల్గొన్నారు.