సుల్తాన్బజార్, మార్చి 11: ఉస్మానియా వైద్యులు మరోసారి ఘనత చాటారు. ఐదు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బాలికలకు విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహించారు. సోమవారం దవాఖానలోని ఆడిటోరియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ వివరాలు వెల్లడించారు. హుజురాబాద్ కమలాపూర్కు చెందిన సింధూజ(11), భువనగిరికి చెందిన వైష్ణవి(13)ల కాలేయాలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ ఇద్దరు బాలికలకు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు ఉస్మానియా వైద్యులు. బ్రెయిన్డెడ్ అయిన వారి నుంచి సేకరించిన కాలేయాలను వారికి విజయవంతంగా అమర్చారు.
5 రోజుల వ్యవధిలో సుమారు 20 గంటల పాటు శ్రమించి రెండు కాలేయ మార్పిడిలను విజయవంతంగా నిర్వహించిన సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హెచ్వోడీ డాక్టర్ మధుసూదన్,ప్రొఫెసర్ డాక్టర్ సుదర్శన్, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ పాండు నాయక్, డాక్టర్ పావని, డాక్టర్ మాధవిలను సూపరింటెండెంట్ ప్రత్యేకంగా అభినందించారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ పూర్తి చేసుకున్న ఇద్దరు బాలికలు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దవాఖాన అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ త్రివేణి, సీఎస్ అడ్మిన్ ఆర్ఎంవో-1 డాక్టర్ శేషాద్రి, డిప్యూటీ సీఎస్ అడ్మిన్ ఆర్ఎంవోలు డాక్టర్ సాయిశోభ, డాక్టర్ బండారి శ్రీనివాసులు, ఆర్ఎంవోలు డాక్టర్ సిద్ధిఖీ, డాక్టర్ సుష్మ తదితరులు పాల్గొన్నారు.