Belt Shops | సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పరిధిలో మరో 29 బెల్టు షాపులపై ఎస్ఓటీ బృందాలు దాడులు జరిపాయి. ఈ దాడుల్లో రూ.6,98,500విలువజేసే మద్యంను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో అక్రమ డబ్బు, అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. దీనికి తోడు హోలీ పండుగ నేపథ్యంలో ఈ నెల 25 నుంచి 26వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూడు కమిషనరేట్ల పరిధిలో మద్యం అమ్మకాలను నిలిపి వేశారు.
దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని మాఫియా గ్యాంగులు అక్రమంగా మద్యం నిలువ చేసుకుని.. బెల్టు షాపుల ద్వారా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై ప్రత్యేక నిఘా పెట్టిన ఎస్ఓటీ పోలీసులు.. గత వారం రోజులుగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 50కి పైగా బెల్టు షాపులు బయటపడగా.. తాజాగా, మరో 29 బెల్టు షాపులను ఎస్ఓటీ పోలీసులు గుర్తించి దాడులు జరిపారు.
కమిషనరేట్లోని 21 ఠాణాల పరిధిలో 29 బెల్టు షాపులను గుర్తించి, వాటిల్లో రూ.6,98,500 విలువజేసే 635 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అత్యధికంగా బాలానగర్ ఠాణా పరిధిలోనే 11 బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆబ్కారీ అధికారుల నిర్లక్ష్యం వల్ల కమిషనరేట్ పరిధిలో బెల్టుషాపులు విచ్చలవిడిగా వెలుస్తున్నాయని, దీని వల్ల శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే పరిస్థితులు ఎదురవుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. గడిచిన నాలుగైదు రోజుల్లోనే రంగారెడ్డి జిల్లా, సైబరాబాద్ పరిధిలో దాదాపు 100 వరకు బెల్టు షాపులను గుర్తించి, అక్రమ మద్యంను సీజ్ చేసినట్లు ఎస్ఓటీ అధికారులు తెలిపారు.