సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : కొత్త సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 31 అర్ధరాత్రి ఒంటిగంట వరకు పబ్బులు, క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు, న్యూఇయర్ ఈవెంట్లలో మద్యం సరఫరాకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. నూతన సంవత్సరానికి వీడుకోలు పలికే 31 డిసెంబర్ను పురస్కరించుకొని పలు ఆంక్షలు, మార్గదర్శకాలను జారీచేశారు. జంటలు, పెద్దల కోసం నిర్వహించే కొత్త సంవత్సర వేడుకలతో పాటు పబ్బులు, క్లబ్బులు, బార్ల్లలో మైనర్లను అనుమతించవద్దని కమిషనర్లు నిర్వాహకులను ఆదేశించారు. ఈవెంట్లలోకి రివాల్వర్ వంటి మారణాయుధాలతో రావద్దని, అశ్లీల నృత్యాలు, అసభ్యకర దృశ్యాలు ప్రదర్శించడం, వ్యభిచారం వంటి వాటిని ప్రోత్సహించడం, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను అనుమతించడం చట్టరీత్య నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈవెంట్ జరిగే ప్రాంగణంలో సౌండ్ 45డిసెబుల్ను మించకూడదని, సామర్థ్యానికి మించి రద్దీని అనుమతించరాదని, ఇష్టానుసారంగా పాసులు, టికెట్లను విక్రయించరాదని హెచ్చరించారు.
ఈవెంట్లు జరిగే ప్రాంతంలో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నిర్వాహకులదేనన్నారు. ఈవెంట్ వద్ద ఏర్పాటు చేసిన ఎంట్రీ, ఎగ్జిట్తో పాటు పార్కింగ్ ప్రాంతాల్లో సైతం సీసీ కెమెరాలను అమర్చాలని, వేడుకలు ముగిసిన తరువాత వాటి ఫుటేజిలను పోలీసులకు సమర్పించాలని తెలిపారు. మద్యం సేవించిన వారిని వాహనాలు నడిపేందుకు అనుమతించరాదని, వారికోసం డ్రైవర్లను ఏర్పాటు చేసే బాధ్యత కూడా నిర్వాహకులదేనన్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే 6నెలల జైలు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ను సస్పెండ్ చేయనున్నట్లు తెలిపారు.
శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షేక్పేట, మైండ్స్పేస్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, రోడ్డు నంబర్ 45 ఫ్లైఓవర్, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరమ్ మాల్-జేఎన్టీయూ ఫ్లైఓవర్, ఖైత్లాపూర్ ఫ్లైఓవర్, బాలానగర్ ఫ్లెఓవర్లను రాత్రి 10 నుంచి ఉదయం 5గంటల వరకు పూర్తిగా మూసివేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. నెహ్రూ ఔటర్ రింగ్రోడ్, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను తప్పా ఇతర వాహనాలకు అనుమతి లేదు.
ఈ నెల 31న, జనవరి 1న క్యాబ్ డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రైడ్ నిరాకరించవద్దని, రైడ్ నిరాకరించి, నిబంధనలు ఉల్లంఘించినవారికి రూ.500జరిమానా విధించనున్నట్లు తెలిపారు. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే 9490617346 నంబర్కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.