కందుకూరు, డిసెంబర్ 10 : నకిలీ ఓట్లను నివారించేందుకు చేపట్టిన ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం ప్రక్రియను అధికారులు చేపట్టారు. రేషన్ డీలర్లు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీల కార్యదర్శుల సహకారంతో ప్రక్రియను వేగవంతం చేశారు. మండలంలోని 45వేలకు పైగా ఉన్న ‘ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం’ చేయాలని తాసీల్దార్ మంచిరెడ్డి మహేందర్రెడ్డి ఆదేశించారు. 35గ్రామ పంచాయతీలతో పాటు అనుబంధ గ్రామాల్లో ఇంటింటికీ సిబ్బంది వెళ్లి ఆధార్ అనుసంధానం చేస్తున్నారు. ఇప్పటికే 75 శాతం పూర్తి చేసినట్లు అధికారులు చెప్పారు.
ఈ విషయంలో అధికారులు, సిబ్బంది ప్రజలకు వస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో సిబ్బందితో ఆధార్ అనుసంధానం ప్రక్రియను చేయిస్తున్నారు. ఆధార్ లేదా, మరో 10 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక కార్డుతో ఓటర్ కార్డును అనుసంధానం చేసుకోవాలని సూచిస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్లో కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ఓటర్ హెల్ప్ లైన్ అప్లికేషన్ ఉంటుందని అందులో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య (ఎపిక్ నంబర్)ను పొందుపరిచి ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. నకిలీ ఓట్ల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రెవెన్యూ అధికారులు కోరతున్నారు.
ముమ్మరంగా..
ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం ప్రక్రియ మండలంలో ముమ్మరంగా కొనసాగుతుంది. బీఎల్ఓలతో పాటు రేషన్ డీలర్లను త్వరగా పూర్తి చేయాల్సిందిగా ఆదేశించా.. ఓటర్ జాబితాలోని తమ పేరును స్వచ్ఛందంగా నమోదు చేసుకునేందుకు, ఓటర్ జాబితాలో బోగస్, నకిలీ పేర్లు లేకుండా చేసేందుకు భారత ఎన్నికల సంఘం ప్రజా ప్రాతినిథ్యం చట్టాన్ని సవరించింది. 18 ఏండ్లు పూర్తయిన ప్రతిఒక్కరూ ఆన్లైన్లో లేదా ఓటర్ హెల్ప్లైన్ యాప్లో ఓటు నమోదు చేసుకోవాలి. బీఎల్వోల సహకారంతో తమ ఓటు నమోదు చేసుకోవచ్చు.
– మంచిరెడ్డి మహేందర్రెడ్డి, తాసీల్దార్ కందుకూరు మండలం