ఖైరతాబాద్, జూలై 16: ‘ప్రకృతి కోసం కలిసి నడుద్దాం..’ అంటూ ఆస్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని జల విహార్ వద్ద ఏర్పాటు చేసిన ‘వాక్ ఫర్ నేచర్’ అంటూ ఆదివారం వాకథాన్ను నిర్వహించారు. ఈ వాకథాన్కు ముఖ్య అతిథులుగా హాజరైన మల్కాజిగిరి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి రామయ్య (వనజీవి రామయ్య), సినీ నటులు అర్జున్ దాస్, మానస్ నాగులపల్లి, సామాజిక కార్యకర్త కడవెండి వేణుగోపాల్, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ అధ్యక్షులు వేద కుమార్, జేఎన్టీయూహెచ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ వాక్ పీపుల్స్ ప్లాజా వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఒక మొక్క నాటాలన్నారు. ఆస్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘క్యాన్సర్, ఆకలి, విద్య’పై అనేక కార్యక్రమాలను నిర్వహించి ఎందరో అభాగ్యులకు సాయం అందిస్తున్నారని, పర్యావరణ పరిరక్షణపై వాక్ ద్వారా అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఆస్యా ఫౌండేషన్ ప్రతినిధి శ్రీరామ్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన విరాళాలను 6వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరిట వారి విద్య కోసం ఆ మొత్తాన్ని అందిస్తామన్నారు. అనంతరం, వనజీవి రామయ్య దంపతులను ఘనంగా సత్కరించారు.
నగరానికి హజ్ యాత్రికులు
హైదరాబాద్, జూలై 16(నమస్తే తెలంగాణ): హజ్ యాత్ర ముగించుకొని వచ్చిన హాజీలకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీమ్ ఆదివారం స్వాగతం పలికారు. విస్తారా ఎయిర్లెన్స్ విమానం నం. 6110 ఐదో ఫ్లైట్ హాజీలకు అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకు హజ్ యాత్ర ముగించుకొని 750 మంది హాజీలు హైదరాబాద్ చేరుకున్నారు. మదీనా నుంచి వచ్చే హాజీలకు జామ్జామ్ క్యాన్లను చైర్మన్ పంపిణీ చేశారు.