బన్సీలాల్పేట్, మే 24 : ప్రపంచ స్కీజోఫ్రీనియా దినోత్సవం సందర్భంగా బుధవారం గాంధీ దవాఖాన మానసిక వైద్య విభాగం ఆధ్వర్యంలో ఓపీ బ్లాక్ హాలులో ప్రజలకు అవగాహన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీజీ, ఇంటర్న్ డాక్టర్లు ‘వీధి నాటకం’ ప్రదర్శించి, స్కీజోఫ్రీనియా లక్షణాలు, మంత్రగాళ్లు చేసే మోసాలు, ప్రభుత్వ దవాఖానలో లభిస్తున్న వైద్య సేవల గూర్చి ఆకట్టుకునేలా వివరించారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు మాట్లాడుతూ.. స్కీజోఫ్రీనియా అనేది ఒక మానసిక వ్యాధి అని, దాని లక్షణాలు తెలుసుకుని వెంటనే ప్రభుత్వ దవాఖానలోని మానసిక వైద్యులను సంప్రదించాలన్నారు. మంత్రగాళ్లు, చేతబడి చేసే మోసగాళ్ల వద్దకు వెళ్లకూడదని, ప్రజలు మూఢనమ్మకాలను వదిలి, వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గాంధీ దవాఖాన మానసిక వైద్య విభాగం హెచ్ఓడీ డాక్టర్ ఎం.ఉమాశంకర్ మాట్లాడుతూ.. స్కీజోఫ్రీనియా సమస్య ఉన్నవాళ్లకు కుటుంబం, స్నేహితులు, సమాజం నుంచి తగిన ప్రోత్సాహం, ఆదరణ అందించాలన్నారు. గాంధీ దవాఖానలోని తమ విభాగంలో ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్స, మందులను అందజేస్తున్నామని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో గాంధీ దవాఖాన కంటి విభాగం హెచ్ఓడీ డాక్టర్ రవిశేఖర్ రావు, ఆర్ఎంఓలు డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ నజీమ్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఇందిర, మానసిక వైద్య విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అజయ్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ డి.సురేశ్, డాక్టర్ అనుపమ, పీజీ, ఇంటర్న్ విద్యార్థులు పాల్గొన్నారు.