తెలంగాణ రైతులను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
పట్టణాలు, గ్రామాలను అభివృద్ధి చేసేది తెలంగాణ ప్రభుత్వమే
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
దమ్మాయిగూడలో సమీకృత మార్కెట్ పనులకు శంకుస్థాపన
మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 9: తెలంగాణ రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని, అందుకు గాను బీజేపీని తరిమి తరిమి కొట్టాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్గూడ 4వ వార్డులో రూ.7 కోట్ల 20 లక్షలతో నిర్మించ తలపెట్టిన సమీకృత మార్కెట్ నిర్మాణానికి శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఇందుకు గాను ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మల్లారెడ్డికి స్థానిక కౌన్సిలర్ మంగళపురి వెంకటేశ్ ఆధ్వర్యంలో బోనాలు, బతుకమ్మలు ఏర్పాటు చేసి డప్పులతో ఘన స్వాగతం పలికారు. శంకుస్థాపన పనులను ప్రారంభించిన అనంతరం, ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మన ముఖ్యమంత్రి పట్టణాలు, గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని అన్నారు.
ప్రజలు ఇబ్బందులు పడకుండా మార్కెట్లు, వైకుంఠ ధామాలు, పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారని, హరితహారంతో గ్రామాలు, పట్టణాలు పచ్చటి తోరణాలుగా దర్శనం ఇస్తున్నాయని తెలిపారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పక్కన ఉన్న జవహర్ నగర్ చెత్త డంపింగ్తో ప్రజలు ఇబ్బందులు పడకుండా, మురుగు నీరు చెరువులలోకి చెరకుండా రూ.7 కోట్లతో పైపులైన్ పనులు చేపట్టినట్లు, డంపింగ్ యార్డు చుట్టు ఉన్న చెరువులలో మురుగు చేరకుండా చర్యలు తీసుకుంటామని, వాటని సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, కమిషనర్ స్వామి, డీఈ సుమతి, కౌన్సిలర్లు కొత్త సురేఖ, హేమలత, సుజాత, స్వప్న హరి గౌడ్, నాను నాయక్, వెంకటేశ్, నర్సింహారెడ్డి, కో ఆప్షన్ సభ్యులు రజిని, నాయకులు భాస్కర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, హరిగౌడ్, ఒర్సు రాములు, తిరుపతి రెడ్డి, మణికంఠ ముదిరాజ్, నరహరిరెడ్డి, అనిల్, శ్రీనివాస్, శ్రీకాంత్ గౌడ్, అధికారులు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.