మేడ్చల్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు కోలాహలంగా మారాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలకు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వస్తూ.. అభ్యర్థులను అభినందిస్తూ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. జిల్లాలోని మంత్రి మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయాలు సందడిగా మారాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జరిగిన అభివృద్ధి, సంక్షేమంతో సంతోషంగా ఉన్నామని, బీఆర్ఎస్ అభ్యర్థులను మరోసారి గెలిపించుకుంటామని స్వయంగా మద్దతు తెలుపుతున్నారు.
బీఆర్ఎస్లోకి చేరికలు
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించగానే ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు పెరిగాయి. జిల్లాలో గిర్మాపూర్, శామీర్పేట్ మండలాలకు చెందిన పలు పార్టీల నాయకులు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థుల ఊసే లేకపోవడంతో ఆ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొంది.
సంక్షేమం.. అభివృద్ధికే జై కొట్టండి
మంత్రి మల్లారెడ్డి.. పలు పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికే ప్రజలు రాబోయే ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ గిర్మాపూర్కు చెందిన మాజీ ఎంపీటీసీ వంగేటి రాజిరెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు సోమవారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అలాగే శామీర్పేట మండలం బాబాగూడలో బీజేపీ నుంచి శ్రీనివాస్, మహేందర్, బాలరాజు, ముఖేశ్, మురళితో పాటు 50 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధికి ఆకర్షితులై స్వచ్ఛందంగా వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేని నేతలు ఇప్పుడు మేం అభివృద్ధి చేస్తామంటే ప్రజలు నమ్ముతారా ? అని ఆయన ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. మాజీ వార్డు సభ్యుడు ప్రేమ్కుమార్, దశరథ్, కుమార్, యాదగిరి, రాజలింగం, శంకర్, ముత్యాలు, శ్రీను, పాండులతో సహా 100 మంది బీఆర్ఎస్లో చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, జడ్పీటీసీ శైలజా రెడ్డి, సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయానందారెడ్డి, బీఆర్ఎస్ మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు శేఖర్గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ పాల్గొన్నారు.
అభివృద్ధి నచ్చి.. పనితీరు మెచ్చి అంబర్పేట బీఆర్ఎస్లో 700 మంది చేరిక
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమంతో పాటు అభివృద్ధి నచ్చి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పనితీరు మెచ్చి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నట్లు మైనార్టీ నాయకులు తెలిపారు. అంబర్పేట డివిజన్ ప్రేంనగర్కు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కె.రాజగోపాల్ నాయుడు ఆధ్వర్యంలో సుమారు 200 మంది మైనార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. అడ్వకేట్ షౌకత్ అలీతో పాటు ఆయన మిత్రబృందం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంది. అలాగే బాగ్అంబర్పేట డివిజన్కు చెందిన పార్టీ సీనియర్ నాయకులు తేజావత్ రమేశ్, పల్లె భారతీరెడ్డి, పద్మజ ముదిరాజ్, శారద ఆధ్వర్యంలో బీజేపీ, కాంగ్రెస్, మహిళా, యువజన సంఘాల ప్రతినిధులు 500 మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారందరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో మైనార్టీల ఓటు శాతం పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ఇ. విజయ్కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు యాసిన్ షరీఫ్, జాఫర్, అనంతుల అనిల్, శ్రీరాములు ముదిరాజ్, సాయికుమార్, లోకేశ్, నాగరాజు, యూసుఫ్, అతీక్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లోకి ఎన్ఎస్యూఐ నేతలు
కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లాస్యనందిత సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు. నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకులు సోమవారం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి లాస్యనందిత గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఇతర పార్టీల నాయకులు పార్టీలో చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం ప్రభుత్వం అందించే ఏదో ఒక పథకంతో లబ్ధి పొందుతున్నదని తెలిపారు. పార్టీ కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
సుపరిపాలనకే పట్టం కట్టండి బీఆర్ఎస్లో చేరిన బీజేపీ నేతలు
సుపరిపాలన అందిస్తున్న సీఎం కేసీఆర్కి మరోసారి ప్రజలు పట్టం కట్టాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ శ్రీనివాస్రావు, కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా సమక్షంలో కేపీహెచ్బీ కాలనీకి చెందిన బీజేపీ నేత బచ్చు నాగమల్లేశ్వర్తో పాటు 60 మంది బీజేపీ నేతలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో మతాలు, కులాల మధ్య చిచ్చులు పెడుతూ రాజకీయం చేస్తున్నదని ఆరోపించారు. పార్టీలో చేరిన నాయకులు బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చుట్టల బస్తీలో మంత్రి పర్యటన
అభివృద్ధి, సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సోమవారం రాంగోపాల్పేట్ డివిజన్ చుట్టల బస్తీలో వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు. బస్తీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్తీలో అదనపు తాగునీటి పైపులైన్ ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే సీవరేజి లీకేజీ సమస్య పరిష్కారానికి అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేసి పనులు ప్రారంభించాలని అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు. శాంతిభద్రతల దృష్ట్యా బస్తీల్లో సీసీ కెమెరాలు, అవసరమైన ప్రాంతాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజావసరాల రీత్యా ప్రస్తుతం ఉన్న కమ్యూనిటీ హాలుపై మరో అంతస్తు నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.