బడంగ్పేట్, డిసెంబర్ 24: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90శాతం పనులు కేసీఆర్ పూర్తి చేస్తే కాంగ్రెస్ సర్కార్ రెండేండ్లలో తట్టెడు మట్టి కూడా వేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.మహేశ్వరం నియోజక వర్గం మీర్పేట్ సర్కిల్ పరిధిలోని జిల్లెలగూడలో ఉన్న సామయాదిరెడ్డి గార్డెన్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల అంశం పై రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచి రెడ్డి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, మహేశ్ రెడ్డి, ఆనంద్, రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, అంజయ్య యాదవ్, రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఇన్చార్జీ పటోళ్ల కార్తీక్ రెడ్డి, క్యామ మల్లేష్ లతో కలిసి బుధవారం ఆమె సమావేశం నిర్వహించారు.
ప్రాజెక్టుల గురించి కేసీఆర్ ప్రజలకు వాస్తవాలు చెప్పితే ప్రభుత్వం జీర్ణించుకోలేక అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. వాస్తవాలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఉలికి పడుతున్నదన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు. పాలమూరు బిడ్డను అని చెప్పుకునే ముఖ్యమంత్రి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లపై సీతకన్నెందుకు వేశారని ఆమె ప్రశ్నించారు. కేంద్రం డీపీఆర్ను వెనక్కి పంపితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సప్పుడు చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. 90 టీఎంసీలు హక్కుంటే 45 టీఎంసీలు ఇస్తే ఎందుకు ఒప్పుకున్నారని ఆమె నిలదీశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.35వేల కోట్లు మంజూరు చేయించి రూ27వేల కోట్లు ఖర్చు చేసి 90శాతం రిజర్వాయర్ పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. పది శాతం పనులను ఈ ప్రభుత్వం చేయించలేక పోయిందన్నారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నది కేసీఆర్ కల
కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కల. పాలమూరు ప్రాజెక్టుపై కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బంది పెట్టిన సందర్భాలున్నాయ. అన్ని సమస్యలను అధిగమించి పర్మిషన్లు తీసుకోవడం జరిగింది. రెండు కిలోమీటర్ల మేరకు కాల్వలు తీస్తే నీళ్లు వస్తాయని తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల ఆరు నెలలకన్నా ముందు మోటర్లు స్టార్ట్ చేస్తే నార్లపూర్ రిజర్వాయర్లో నీళ్లు పడుతుంటే ఎంతో ఆనందం అనిపించింది. కేసీఆర్ ఆలోచన చేయక ముందు రంగారెడ్డి జిల్లాకు నీళ్లు వస్తాయన్న ఆశ ఉండేది కాదు. పాలమూరు రంగారెడ్డి మొదలుపెట్టిన తర్వాత నీళ్లు వస్తాయని కేసీఆర్ భరోసా కల్పించారు.
మహేశ్వరం, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల నియోజకవర్గాలకు సాగు నీరు వచ్చేలా ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సాగు నీరుతో పాటు ప్రతి ఇంటికి మంచి నీళ్లు అందించడం జరిగింది. కాళేశ్వరం పూర్తి చేశామని, పాలమూరు పూర్తి చేస్తే తన కల నెరవేరుతుందని చాలా సందర్భాల్లో కేసీఆర్ గుర్తు చేసేవారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజలకు ప్రాజెక్టుల గురించి వివరిస్తాం. తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల గురించి మాట్లాతే కేసీఆర్పై తప్పుడు ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు.
పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే కేసీఆర్ లక్ష్యం. పాలమూరు జిల్లా కూలీల వలసల, పేదల జిల్లాగా గుర్తించి ప్రాజెక్టులు నిర్మాణం చేయడం జరిగింది.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలి. పాలమూరును పక్కన పెట్టి కొడంగల్కు నీళ్లు తీసుకపోతామని చెప్పడం ఎంతవరకు సమంజసం. పరిగి, తాండూరు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, పాలమూరు, వికారాబాద్ ప్రజలకు నీళ్లు ఎందుకు ఇవ్వరు. ప్రభుత్వం కండ్లు తెరచి ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే మెడలు వంచి పనులు చేయిస్తాం.
– సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే
రెండు సంవత్సరాలలో ప్రాజెక్టులకు పైసా ఇవ్వలేదు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్కులకు కాంగ్రెస్ సర్కార్ రెండేండ్లలో పైసా ఇయ్యలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 90 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం పది శాతం పనులు పూర్తి చేయలేక కేసీఆర్పై లేని పోని ఆరోపణలు చేస్తున్నారు. రైతాంగాన్ని ఆదుకునే ఏ ఒక్కపని చేపట్టలేదు. రంగారెడ్డి వికారా బాద్ జిల్లాలకు సంబంధించిన నియోజక వర్గాలను పట్టించుకోలేదు. ప్రాజెక్టుల నిర్మాణానికి తట్టెడు మట్టి కూడా పోయలేదు.
రంగారెడ్డి జిల్లాకు కావలసిన ఐదులక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉంది. ఆరు నియోజక వర్గాలలకు నీళ్లు లేక ఎడారిగా మారే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారింది. ప్రతి గ్రామానికి, మండలానికి, నియోజక వర్గాలకు పోయి ప్రజలను, రైతులను చైతన్యవంతం చేస్తాం. ఎంత దూరమైనా పోతాం. పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళికలు చేస్తున్నాం. భారీ సభలు ఏర్పాటు చేయబోతున్నాం. తక్షణమే స్పందించి ఉద్దండ్ పూర్ నుంచి నీళ్లు తీసుక రావాలి. లేదంటే ప్రజా యుద్ధం తప్పదు.
– మంచి రెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు
అమలుకాని హమీలు ఇచ్చారు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇస్తామన్న కాంగ్రెస్ రైతులకు హమీలు ఇచ్చి ముఖం చాటేశారు. లక్ష్మిదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణం చేయించి పది టీఎంసీల నీళ్లు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క పాద యాత్రలు చేసి ఇచ్చిన హమీలను గాలికి వదిలేశారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదు. కేసీఆర్ పేరు లేకుండా ప్రసంగించే పరిస్థితి లేదు. – మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ
దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ. కేసీఆర్ సాగుకు నీళ్లు ఇవ్వడం వల్లనే రాష్ట్రంలో వరి సాగు పెరిగింది. కాంగ్రెస్ బూటకపు ముచట్లు చెప్పి ప్రజలను మోసం చేశారు. పాల మూరు రంగారెడ్డి ప్రాజెక్టుల ద్వార నీళ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారు. వికారాబాద్, తాండూరు కు నీళ్లు వచ్చే వరకు పోరాటం ఆగదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. వికారాబాద్, తాండూరు ప్రజలకు న్యాయం చేయాలి. ప్రభుత్వం పట్టించుకోక పోతే రైతుల పక్షాన పోరాటం చేస్తాం. లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి.
– రోహిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
డిఫెన్స్లో రేవంత్రెడ్డి సర్కార్
కేసీఆర్ ప్రెస్మీట్ తర్వాత రేవంత్రెడ్డి సర్కార్ పూర్తిగా డిఫెన్స్లో పడింది. సీఎం, మంత్రుల వద్ద ప్రజలకు చెప్పడానికి సబ్జెక్ట్, సమాధానంలేక రేవంత్రెడ్డి చిట్చాట్ పెట్టి వివరణ ఇస్తున్నారు. అరడజన్ మంది మంత్రులు, పోటీపడి ప్రెస్ మీట్ పెట్టారంటే కేసీఆర్ అంటే వారికి ఎంత భయముందో అర్థమవుతున్నది. ప్రాజెక్టులపై, నదీజలాలపై సంబంధిత మంత్రికి ఎలాంటి సబ్జెట్ లేదు. బీఆర్ఎస్ శ్రేణులతో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నాం. కేసీఆర్ సమస్యలపై స్పందించడంతో కాంగ్రెస్లో కల్లోలం మొదలైంది. సీఎం కేసీఆర్తో జిల్లాల్లో బహిరంగ సభలు పెట్టించాలని ప్లానింగ్ చేస్తున్నాం. ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుంది.
– మెతుకు ఆనంద్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు
ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి ప్రదర్శిస్తోంది. కేసీఆర్ సీఎం అయిన తర్వాత బీమా, నెట్టెంపాడు, మహాత్మాగాంధీ ప్రాజెక్టులను, ఆర్డీఎస్ కెనాల్ను పూర్తి చేయడం జరిగింది. సుందిల్ల, ఓఎస్ సాగర్, రమన్పాడు ప్రాజెక్టుల నిర్మాణం చేయించి 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అధించాలన్నదే కేసీఆర్ లక్ష్యం.పాలమూరు జిల్లా కూలీల వలసల, పేదల జిల్లా గా గుర్తించి ప్రాజెక్టులు నిర్మాణం చేయడం జరిగిందన్నారు.
కేసీఆర్ రెండోసారి సీఎం అయిన తర్వాత గార్లపూర్, ఏదుల, గొట్టెం, గడివేల, ఉద్దారం రిజర్వాయర్లను పూర్తి చేయించారు. ప్రతి ఎకరాకు సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో కేసీఆర్ పనిచేశారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ పాలసీలు తీసుకొస్తున్నట్లు గొప్పలు చెప్పడం జరిగింది. రైతులను వంచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. త్వరలోనే నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో సభలు సమావేశాలు పెట్టి కాంగ్రెస్ను ఎండగడుతాం.
– జైపాల్యాదవ్, మాజీ ఎమ్మెల్యే