ఎల్బీనగర్, అక్టోబర్ 31 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జయభేరి మోగించడం ఖాయమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం నాగోలులో కురుమల ఆత్మీయ సమ్మేళనం, మన్సూరాబాద్ డివిజన్లో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ప్రచార కార్యక్రమాలతోపాటుగా డివిజన్ల వారీగా పలు ప్రచార కార్యక్రమాల్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే పాల్గొన్నారు. పదకొండు డివిజన్లలోనూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డిని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల ఇబ్బందులు తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం పథకాలను రూపకల్పన చేసి అమలు చేస్తున్నారన్నారు. రైతన్నలను రాజుగా చేసేందుకు రైతుబంధు పథకంతోపాటుగా రైతుబీమా పథకం, ఉచిత విద్యుత్, సాగునీరును అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అందరూ అండగా నిలవాలన్నారు. కురుమల ఆత్మీయ భవనానికి కోకాపేట్లో స్థలం, నిధులు ఇవ్వడం జరిగిందని, కురుమల కోసం గొర్రెల పంపకంతో ఆర్థిక పరిపుష్టి కలుగుతుందన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో చెరువుల సుందరీకరణతోపాటుగా వాకింగ్ ట్రాక్ల నిర్మాణం, ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేయడంతోపాటుగా యోగా కోసం నిర్మాణాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం కురుమ, బొగ్గారపు దయానంద్ గుప్తతోపాటుగా కురుమ సంఘం నాయకులు, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.