సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 2020 నుంచి పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి మార్చి 31లోగా క్రమబద్ధీకరణ ప్రక్రియను ముగించాలని ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.
దేవాదాయ, వక్ఫ్ భూములు, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు తప్పా ఇతర భూముల రెగ్యులరైజేషన్ను చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. 2020లో ప్లాట్ల రెగ్యులరైజేషన్కు లక్షలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిలోనే 5 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు 1,06,920 వరకు వచ్చాయి.
వీటిని క్రమబద్ధీకరణ చేస్తే ఫీజుల రూపంలో సుమారు రూ. 450 కోట్ల ఆదాయం రావొచ్చని అధికారులు అంచనా. 7 జిల్లాల పరిధిలో విస్తరించిన ఉన్న హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 47 మునిసిపాలిటీలను మినహాయిస్తే మిగతా ప్రాంతాల్లోంచి వచ్చిన దరఖాస్తులే 3,44,726 వరకు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 50,025 దరఖాస్తులను హెచ్ఎండీఏ అధికారులు జోన్ల వారిగా పరిశీలన చేశారు. మిగతా వాటిని పరిశీలన చేసి క్రమబద్ధీకరించే పనిని వేగవంతం చేయనున్నారు.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణపై అధికారుల్లో అయోమయం నెలకొంది. ఎల్ఆర్ఎస్ పథకం అమలుపై కోర్టుల్లో కేసులు నమోదు కావడంతో గత ప్రభుత్వం క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి స్థాయిలో చేపట్టలేదు. కేవలం సింగిల్ ప్లాట్ల క్రమబద్ధీకరణకు రూ.1000ల చొప్పున, ఒకేసారి లేఅవుట్ మొత్తానికి క్రమద్ధీకరణ చేసేందుకు రూ.10వేల చొప్పున 2020లో ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించింది.
దీనిపై కోర్టులో ఫిటిషన్లు దాఖలైనప్పటికీ ఎలాంటి తీర్పులు వెలువడలేదు. అయితే ఇదే సమయంలో సిబ్బంది కొరతతో రాష్ట్ర స్థాయిలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ)ని ఆన్లైన్లో స్వీకరించిన దరఖాస్తులను క్రమపద్ధతిలో ఉంచి, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల వారీగా వేరు చేసింది. ఆయా విభాగాలు దరఖాస్తుల పరిశీలన చేస్తూ, ఫీజు చెల్లించే వరకు నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ను మాత్రం జారీ చేయలేదు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే వచ్చే లిఖిత పూర్వక ఆదేశాలతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపడతామని, నెల రోజుల వ్యవధిలోనే ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం కాదని ఓ ప్లానింగ్ అధికారి తెలిపారు.