మన్సూరాబాద్, జనవరి 1 : ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో 2021తో పోలిస్తే 2022లో కేసులు పెరిగాయి. నేరాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడం, గొడవల విషయంలో ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా కేసులు నమోదు చేశారు. పాత నేరస్తులపై ఎప్పటికప్పుడు కఠినంగా వ్యవహరించారు. రోడ్డు ప్రమాదాలు, అదృశ్యం కేసులు ఎక్కువగా నమోదు కావడం, పెట్టీ కేసులూ నమోదు కావడంతో ఈ ఏడాది కేసుల సంఖ్య పెరిగినప్పటికీ నేరాలను అరికట్టడంలో పోలీసులు విజయం సాధించారు. చైన్ స్నాచింగ్లు, తాళాలు పగులగొట్టి ఇండ్లలో దొంగతనాలు, హత్యలు, కిడ్నాప్లు తగ్గు ముఖం పట్టడం ఎల్బీనగర్ వాసుల్లో ధైర్యాన్ని నింపుతున్నాయి. పోలీసులు కాలనీ సంక్షేమ సంఘాలకు అవగాహన కల్పించి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నేరాల నియంత్రణకు ఎంతో తోడ్పాటునందిస్తున్నాయి.
13,412 సీసీటీవీ కెమెరాలతో నిఘా
ప్రజల సహకారంతో పోలీస్స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు సుమారు 13,412 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందులో 2022లో 729 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నేరాల నియంత్రణ కోసం సీసీటీవీ కెమెరాల ఆవశ్యకతపై పోలీసులు కాలనీవాసులకు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలకు అవగాహన కల్పించారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో ప్రజల్లో భద్రతా భావం పెంపొందింది.
నేరాల వివరాలు..
ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో 2021లో 1804 కేసులు నమోదు కాగా 2022 డిసెంబర్ 29 నాటికి 2039 కేసులు నమోదయ్యాయి. 2022లో నమోదైన కేసుల్లో మిస్సింగ్లు, రోడ్డు ప్రమాదాలు పెట్టీ కేసులే అధికంగా ఉన్నాయి. 2021లో జరిగిన కేసుల్లో ప్రజలు కోల్పోయిన సొత్తు నుంచి 64శాతం రికవరీ చేయగా.. 2022లో ప్రజలు కోల్పోయిన సొత్తు నుంచి 55 శాతం రికవరీ చేశారు. వివిధ కేసుల్లో నేరాలకు పాల్పడిన వారిలో 470 మందికి జైలు శిక్షలు.. ఎస్సీ, ఎస్టీ కేసులు 2021లో 17 నమోదు కాగా 2022లో 19 నమోదయ్యాయి. అగ్ని ప్రమాదం కేసులు 2021లో 4 నమోదు కాగా 2022లో 3 నమోదయ్యాయి. ఆత్మహత్యలు 2021లో 72 నమోదు కాగా 2022లో 35 కేసులు నమోదయ్యాయి. పీడీ యాక్ట్ కేసులు గత ఏడాది 26 నమోదు కాగా ఈ ఏడాది 14 కేసులు నమోదయ్యాయి.
ప్రజల్లో అవగాహనతో..
పోలీసులు ప్రజల్లో కల్పించిన అవగాహన కార్యకమాలతో చైన్స్నాచింగ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది 2021లో 2 చైన్స్నాచింగ్ కేసులు నమోదు కాగా 2022లో 4 కేసులు నమోదయ్యాయి. 2021లో 102 వాహనాలను దొంగలు అపహరించుకు పోగా ఇందులో 74 వాహనాలను నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2022లో 158 వాహనాలు అపహరణకు గురి కాగా నిందితుల నుంచి 79 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాళం పగులగొట్టి ఇండ్లలో దొంగతనాలు (హెచ్బీ డే, నైట్) 2021లో 35 కేసులు నమోదు జరుగగా 2022లో 49 కేసులు నమోదయ్యాయి. 2021లో దోపిడీ కేసులు 10 నమోదు కాగా 2022లో 14 నమోదయ్యాయి.
సీపీ సూచనలతో..
రాచకొండ కమిషనరేట్ గత సీపీ మహేశ్ భగవత్ సలహాలు, సూచనలతో ముందుకు సాగుతూ ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాం. కేసులు నమోదు చేయడమే కాకుండా వాటిని కోర్టుల్లో రుజువు చేసేందుకు సరైన సాక్ష్యాలను సేకరించి నేరస్తులకు శిక్ష పడేలా చేశాం. ఎల్బీనగర్ పీఎస్ పరిధిలోని పలు కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు సహకరిస్తున్నారు. ఇప్పటికే ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో 13,412 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. చోరీలు, డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారిపై పీడీ యాక్టులు నమోదు చేస్తున్నాం. శాంతిభద్రతల సమస్యపై ప్రజలకు భరోసా కల్పిస్తున్నాం.
– అంజిరెడ్డి, ఎల్బీనగర్ సీఐ