చాంద్రాయణగుట్ట, సెప్టెంబర్ 8 : పాతబస్తీలో గణేశ్ సామూహిక ఊరేగింపు వేడుకలకు సర్వం సిద్ధమైంది. నగర పోలీస్ కమిషనర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పాతబస్తీ మార్గంలో కొనసాగే బాలాపూర్ వినాయకుడితోపాటు చాంద్రాయణగుట్ట, శాలిబండ, ఛత్రినాక, ఫలక్నుమా నుంచి నయాపూల్ వరకు ప్రధాన రహదారుల్లో కొనసాగుతూ చార్మినార్ కేంద్రంగా హుస్సేన్సాగర్ వైపు ముందుకు సాగే వినాయకులకు ప్రత్యేక భద్రతను పోలీసులు కల్పించనున్నారు.
దక్షిణ మండలంలో 18 పోలీస్స్టేషన్ల పరిధిలో అత్యధికంగా ఛత్రినాక పోలీస్స్టేషన్ పరిధిలో నుంచి నెక్లస్ రోడ్డుకు గణపతులు ఊరేగింపుగా బయలుదేరనున్నాయి. దక్షిణ ప్రాంతం నుంచి దాదాపుగా వెయ్యి గణపతులు మండపాల్లో కొలువుదీరినప్పటికీ ఇప్పటికే 500 విగ్రహాలను నిమజ్జనం చేశారు. నేడు జరగబోయే సామూహిక ఊరేగింపులో 400 నుంచి 450 వినాయక విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. ముఖ్యంగా బాలాపూర్, బార్కార్, చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, లాల్దర్వాజమోడ్, శాలిబండ, చార్మినార్ కేంద్రంగా ముందుకుసాగే ఊరేగింపుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
గణేశ్ నిమజ్జనం సందర్భంగా పాతబస్తీలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపుగా నగర పోలీసులతో పాటు జిల్లాల నుంచి వచ్చిన 2500 మంది పోలీసులు, ఉన్నతాధికారులు బందోబస్తులో పాల్గొంటున్నారు. వీరితోపాటు టాస్క్ఫోర్సు, రాఫిడ్యక్షన్, ఇంటలిజెన్స్, స్పెషల్ టీంలు పని చేయనున్నాయి. సాగర తీరానికి బయలుదేరే గణపతుల వద్ద పాటించే నియమ, నిబంధనలను ఇప్పటికే మండప నిర్వాహకులకు, కమిటీల సభ్యులకు పోలీసులు సూచనలు చేశారు. ఇటీవలే ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దృష్టిలో పెట్టుకొని ఏ చిన్న సంఘటన చోటుచేసుకుకోకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. శాంతి సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తమ సేవలను అందించనున్నారు.
సామూహిక గణేశ్ నిమజ్జన వేడుకలను భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఫలక్నుమా ఏసీపీ షేక్ జహంగీర్ సూచించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుకున్న భక్తులు నిమజ్జన వేడుకల్లో సాంప్రదాయం పాటించి సంతోషంగా పండుగను నిర్వహించుకోవాలన్నారు. సౌత్జోన్ పోలీస్స్టేషన్ల పరిధిలో వినాయక ఉత్సవాలకు ఫలక్నుమా ఏసీపీ పరిధిలో ఫలక్నుమా, ఛత్రినాక,శాలిబండ,చాంద్రాయణగుట్ట ఎంతో కీలకమైన ప్రాంతాలు అన్నారు. ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో గణనాథులు హుస్సేన్సాగర తీరానికి చేరుకోనున్నట్లు ఆయన తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.