కేపీహెచ్బీ కాలనీ, జనవరి 13 : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే.. బాధ్యతగా ఒకసారి ఓటరు జాబితాను పరిశీలించాలని, ముసాయిదా ఓటరు జాబితాలో అభ్యంతరాలుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అధికారులు సూచిస్తున్నారు. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కూకట్పల్లి నియోజకవర్గంలో తుది ఓటరు జాబితాను రూపొందించేందుకు అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు.
ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించడంలో భాగంగా ఓటరు జాబితాతో ఇంటింటికీ సర్వే నిర్వహించి డూప్లికేట్ ఓట్లను తొలగించారు. తాజాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 18 ఏండ్లు నిండిన యువతీయువకులందరికీ ఓటు హక్కు కల్పించాలన్న లక్ష్యంతో మరోసారి దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతున్నారు. ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించిన నేపథ్యంలో.. ఈ ముసాయిదా ఓటరు జాబితాలో పేరు ఉందో.. లేదో? ఒకసారి పరిశీలించాలని.. జాబితాలో పేరు లేకున్నా.. తప్పొప్పులున్నా గుర్తించి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం 4,68,237 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,44,969, మహిళలు 2,23,146, ఇతరులు 122 మంది ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 4,63,864 మంది ఓటర్లు ఉండగా.. తాజాగా ప్రచురించిన ఓటరు జాబితాలో ఓటర్లు పెరిగారు. ఎన్నికలు జరిగిన తర్వాత వచ్చిన దరఖాస్తులన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చారు. అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితాతో పోల్చితే ముసాయిదా ఓటరు జాబితాలో 4,373 మంది ఓటర్లు పెరిగారు. ఓటరు నమోదుకు మరోసారి అవకాశం కల్పించడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయి. ఆన్లైన్/ఆఫ్లైన్లో ఓటరు జాబితాను అందుబాటులో ఉంచాం. అభ్యంతరాలు, ఫిర్యాదులుంటే ఈనెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ. అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాం.
– ఎ.రమేశ్, ఏఈఆర్వో, కూకట్పల్లి