సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ ) : తెలంగాణ సంసృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం బోనాల ఏర్పాట్లు, నిర్వహణపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో డా.బీఆర్.అంబేదర్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. బోనాలు ఉత్సవాల నిర్వహణపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ… ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి, తొమ్మిదేండ్లుగా ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. బోనాల ఉత్సవాలకు ఈ ఏడాది రూ.15 కోట్లు కేటాయించారని, ఆ నిధులను సద్వినియోగం చేసుకుని బోనాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, డిప్యూటీ మేయర్, తదితరులు 26 దేవాలయాల్లో ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
9న సికింద్రాబాద్ మహంకాళి..16న పాతబస్తీ బోనాలు..
ఈ నెల 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 16న హైదరాబాద్ పాతబస్తీ బోనాలు నిర్వహించనున్నట్లు మంత్రులు తెలిపారు. ఉత్సవాలకు వారం రోజుల ముందు నుంచే ఆలయాల్లో ఏర్పాట్లకు ప్రత్యేక ఆర్థిక సహాయం చెక్కులు అందజేయాలని అధికారులకు సూచించారు. బోనాలకు వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయాల వద్ద క్యూలైన్లు, నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. అమ్మవారి ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దాలని, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించాలన్నారు. సాంసృతిక శాఖ ఆధ్వర్యంలో పలు ఆలయాల వద్ద ప్రత్యేకంగా స్టేజీలు ఏర్పాటు చేసి ప్రత్యేక కళా బృందాలతో కార్యక్రమాలు నిర్వహించాలని వివరించారు. భక్తుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో ఎల్ఈడీ స్రీన్లతో పాటు లేజర్ షో ఏర్పాటు చేయాలని, బోనాలను విశిష్టతను తెలియజేసేలా విసృ్తత ప్రచారం నిర్వహించాలని ఐఅండ్పీఆర్, పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనీల్కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమోయ్ కుమార్, దేవాదాయ, పర్యాటక, సమాచార, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
మహంకాళి బోనాలకు మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డికి ఆహ్వానం
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే బోనాల మహోత్సవాలకు రావాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డిని ఆహ్వానించారు.ఈ మేరకు అంబేదర్ సచివాయంలో మంత్రి తలసాని నేతృత్వంలో ఆలయ కమిటీ, ఆలయ కార్యనిర్వహణాధికారి, అర్చకులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు.