సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): శివారు ప్రాంతాల్లో ప్రణాళికగా పట్టణీకరణ జరిగేలా హెచ్ఎండీఏ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నది. ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని హెచ్ఎండీఏ మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. హైదరాబాద్ మహానగరం ఔటర్ రింగు రోడ్డు దాటి నలు దిక్కులా విస్తరిస్తోంది. దానికనుగుణంగానే ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చుట్టూ ఉన్న ప్రాంతాలను గ్రామ పంచాయతీలుగా వదిలేయకుండా ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ జరిగేలా మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ తరహాలో ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తోంది.
తాజాగా హెచ్ఎండీఏ పరిధిలో పార్కులుగా గుర్తించిన స్థలాల్లో ల్యాండ్ స్కేపింగ్ చేసేందుకు చర్యలు చేపట్టారు. లేఅవుట్లలో భాగంగా పార్కులకు కేటాయించిన స్థలాలు కబ్జాకు గురి కాకుండా చూడటంతో పాటు వాటిని చుట్టు పక్కల వారికి ఉపయోగపడేలా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం ఇటీవల పనులు చేపట్టేందుకు టెండర్లను పిలిచారు. ఈ నెల 28లోగా టెండర్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్ను జారీ చేసింది.అర్హత కలిగిన సంస్థలను ఎంపిక చేసి ప్రాధాన్యతా క్రమంలో పార్కుల్లో పచ్చదనం పెంపొందించడంతో పాటు మొక్కలను పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నారు.