మేడ్చల్, డిసెంబరు 13: గిరిజనుల భూ ఆక్రమణకు నాకెలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడుచింతపల్లి మండలం కేశవరం గ్రామ సర్వే నంబర్ 33, 34, 35లోని 47 ఎకరాల 18 గుంటల గిరిజనుల భూమి ఆక్రమణపై కేసు నమోదు చేయడంపై ఆయన మాట్లాడారు. ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లో కానీ, పహణీలో కానీ తన పేరు ఎక్కడా లేదన్నారు. అలాంటప్పుడు తన పేరుపై కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఆ డాక్యుమెంట్లో పేరు ఉన్న వారిపై కేసు నమోదు చేస్తే సమాధానం ఇస్తారన్నారు. ఈ విషయమై ఇన్స్పెక్టర్తో మాట్లాడినట్టు తెలిపారు. ఏసీపీకి కూడా ఫిర్యాదు చేశానన్నారు. కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం కూడా చేస్తానన్నారు.
గిరిజనుల భూమిని అక్రమంగా కబ్జా చేశారని మాజీ మంత్రి మల్లారెడ్డి సహా మరో 9 మంది అనుచరులపై శామీర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. చీటింగ్ కేసు 420తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మూడుచింతపల్లి మండలంలోని కేశవరం గ్రామ సర్వే నంబర్లు 33, 34, 35లోని 47 ఎకరాల 18 గుంటల భూమి గిరిజనులకు వారసత్వంగా వచ్చింది. మల్లారెడ్డి ఆ భూమిని కాజేయాలని తన అనుచరులతో కలిసి కుట్ర చేయించారని ఆరోపిస్తూ గిరిజనులు శామీర్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మల్లారెడ్డితో పాటు అతడి అనుచరులు శ్రీనివాస్ రెడ్డి, గోనె హరిమోహన్ రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి, శివుడు, స్నేహ రాంరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, నేహారెడ్డి తదితరులపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యే మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు బుధవారం శామీర్పేట పోలీస్స్టేషన్ ముందు ఆందోళన చేశారు.