మేడ్చల్, (నమస్తే తెలంగాణ): కొండపోచమ్మ జలాశయం నుంచి మేడ్చల్మల్కాజిగిరి జిల్లాకు 10వేల ఎకరాలకు సాగునీరందించేందుకు రూపొందించిన ప్రణాళికలు త్వరలోనే అమలు చేయనున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పనులను వేగవంతం చేశారు. కాల్వలకు కావాల్సిన భూసేకరణ ప్రక్రియను పూర్తిచేశారు. శామీర్పేట్లో పంపుహౌజ్ నిర్మాణానికి భూసేకరణకై సర్వేను ప్రారంభించనున్నట్లు రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. కొండపోచమ్మ జలాశయం నుంచి సిద్దిపేట జిల్లా మైలారం నుంచి మేడ్చల్ జిల్లా రావల్కోల్ చెరువు ద్వారా శామీర్పేట్ పెద్ద చెరువులో నీటిని నింపనున్నారు. పంప్హౌజ్ దీనిద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సాగునీటిని అందించనున్నారు. 10వేల ఎకరాలకు సాగునీరందితే జిల్లాలోని భూములన్నీ సస్యశ్యామలం కానున్నాయి.
కాలువల నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేశారు. 91 ఎకరాలకు సంబంధించి భూపరిహారం అందించేందకు సంప్రందిపుల కమిటీ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే పరిహారం అందించనున్నారు. రావల్కోల్లో 80, శామీర్పేట్లో 11 ఎకరాలు రైతుల వద్దనుంచి సేకరించిన విషయం విధితమే. పరిహారం అందించిన వెంటనే కాల్వల నిర్మాణం చేపట్టానున్నారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూమిని ఇచ్చేందుకు అంగీకరించారు.
శామీర్పేట్ పెద్ద చెరువు సమీపంలో పంపుహౌజ్ నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సర్వేను ప్రారంభించారు. పంపుహౌజ్ నిర్మాణం చేపట్టి పైపులైన్ల ద్వారా సాగునీటిని అందించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. కాలువలతో పాటు పైపులైన్ల నిర్మాణాల ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సాగునీటిని అందించనున్నారు. మేడ్చల్ మల్కాగిజిగిరితో పాటు యాదాద్రి జిల్లాకు శామీర్పేట్లో నిర్మించనున్న పంపుహౌజ్ ద్వారా సాగునీటిని అందించనున్నారు. పైపులైన్ల ద్వారా సుమారు 22 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్రణాళికను చేశారు. అయితే పైపులైన్ల నిర్మాణాలకు భూ సేకరణకు నిమిత్తం లేకుండా రోడ్డుకు ఇరువైపులాల పైపులైన్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు.