కంటోన్మెంట్, జనవరి 5: ప్రపంచ ఎబిలిటీ క్రీడల్లో గెలుపొంది పారా ఒలింపిక్స్కు అర్హత సాధించడం గొప్ప విషయమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. శుక్రవారం రసూల్పురాలోని ఆదిత్య మెహతా ఫౌండేషన్(ఏఎంఎఫ్), జవహర్ నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యంలో పారా ఒలింపిక్స్ 2024కు అర్హత సాధించిన క్రీడాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమానికి వర్చువల్గా హాజరైన గవర్నర్ తమిళిసై.. క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారా అథ్లెట్లతో దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉన్నదని అన్నారు. డిస్కస్ త్రోలో షాట్పుట్లో జ్యోతి క్యాంసం సాధించడంతో పాటు హ్యాండ్ సైక్లింగ్లో ప్రశాంత్ క్యాంసం సాధించడం ఆనందంగా ఉన్నదని సినీ నటి, నిర్మాత మంచు లక్ష్మి అన్నారు. ఆయా విభాగాల్లో స్వర్ణం, రజత, కాంస్య పతకాలు సాధించి ఫౌండేషన్కు మంచి పేరు తేవడం గర్వకారణంగా ఉందన్నారు.
ఆదిత్య మెహత ఫౌండేషన్ దశాబ్ద కాలంగా పారా అథ్లెట్లకు శిక్షణ అందించడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించి, వారి సామర్థ్యాలను వెలికితీయడం ఎందరికో స్ఫూర్తినిస్తుందని కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ అన్నారు. అనంతరం క్రీడాకారులకు కృత్రిమ అవయవాలు, వీల్చైర్లు, క్రీడా పరికరాలతో సహా సుమారు రూ.1.5కోట్ల విలువైన శిక్షణ పరికరాలను ఆదిత్యా మెహతా ఫౌండేషన్ అందించింది. అంతకు ముందు క్రీడాకారులకు పతకాలను అందించడంతో పాటు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంఎఫ్ ట్రస్టీ, ఫాస్ట్ మిసెస్ ఇండియా, ఎంటర్ప్రెన్యూర్ శిల్పారెడ్డి, ఎన్ఎండీసీ చైర్మన్ అమితవ్ ముఖర్జీ, జేఎన్వీ సౌత్ రీజియన్ హెడ్, డిప్యూటీ కమిషనర్ టీ.గోపాల కృష్ణ, ఏఎంఎఫ్ ఫౌండర్ ఆదిత్య మెహతా తదితరులు పాల్గొన్నారు.
కార్వాన్: కార్వాన్లోని జాఫర్గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ , పెగా సిస్టం ఇండియా సంస్థల అధ్వర్యంలో పలు వసతులు కల్పించారు. వీటి ప్రారంభోత్సవానికి టీచ్ ఫర్ చేంజ్ వ్యవస్థాపకురాలు, నటి మంచులక్ష్మి హాజరయ్యారు. పాఠశాల ఆవరణలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంచులక్ష్మి మాట్లాడుతూ తెలంగాణలో విద్యతో విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పెగా సిస్టమ్స్ ఇండియాతో కలిసి విద్యార్థులకు అనుకూలమైన వాతావరణంలో తరగతులు బోధించేలా తమ సంస్థ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధరణికోట సుయోధన్, విద్యాశాఖ అధికారిణి రోహిని దేవి లతో స్థానిక బీఆర్ఎస్ నాయకుడు జీవన్ సింగ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.