Gandipet | “గండిపేట పరిధిలోని ఉస్మాన్సాగర్ మరింత సుందరంగా తయారు కానుంది. ప్రభుత్వం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో గండిపేట చెరువును తీర్చిదిద్దనున్నది. ఇప్పటికే రూ.36 కోట్లతో లేక్ వ్యూ పార్క్ను అద్భుతంగా నిర్మించిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో అత్యాధునిక శైలిలో ఉస్మాన్సాగర్ చుట్టూరా 70 ఎకరాల్లో అత్యద్భుతమైన పార్కు విస్తరణకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. కాగా, రూ.1.77 కోట్లతో సేకరించిన స్థలం చుట్టూ రక్షణ చర్యగా ఫెన్సింగ్ను ఏర్పాటు చేసింది.”
సిటీబ్యూరో, జూన్ 24(నమస్తే తెలంగాణ): జంట జలాశయాల్లో ఒకటైన గండిపేటకు మహర్దశ పట్టనుంది. చారిత్రాత్మక హైదరాబాద్ మహానగరం మధ్యలో ఉన్న హుస్సేన్సాగర్ తరహాలో గండిపేట జలాశయాన్ని సైతం దశల వారీగా అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే చెరువు లోపలి వైపు లేక్ వ్యూ పార్క్ను రూ.36 కోట్లతో అద్భుతంగా నిర్మించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) సంస్థ, రెండో దశలో భాగంగా మరో 70 ఎకరాల స్థలంలో విస్తరణకు ప్రతిపాదనలు రూపొందిస్తోంది. ఇందుకోసం సర్వే నంబరు 18, 45 పరిధిలోని సుమారు 70 ఎకరాల స్థలాన్ని హెచ్ఎండీఏకు అప్పగించారు. గండిపేట చెరువు కట్ట కింద ఉన్న ఈ స్థలం ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది.
పూర్తిగా చెట్లు, కొండలు, రాళ్లల్లో ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో పార్కుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలను హెచ్ఎండీఏ చేపట్టింది. ఇందులో భాగంగానే మొదట స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు టెండర్లు పిలిచారు. ఈ నెల 19న టెండర్లు పిలిచిన అధికారులు చివరి తేదీని జూలై 3వ తేదీ వరకు నిర్ణయించారు. గడువులోగా వచ్చిన టెండర్లను పరిశీలించిన అనంతరం, అర్హులైన కాంట్రాక్టర్తో స్థలం చుట్టూ జాలీతో కూడిన (చెయిన్ లింకు మెష్) ఫెన్సింగ్ను ఏర్పాటు చేయించనున్నారు. స్థలాన్ని పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకున్న అనంతరం, డిజిటల్ సర్వే చేసి సరిహద్దులు, అందులో ఉన్న చెట్లు, ఇతర కాలువలను పరిశీలించిన తర్వాత ఎలాంటి నిర్మాణాలతో పార్కును నిర్మించాలో నిర్ణయిస్తామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
హెచ్ఎండీఏకు.. గండిపేట అభివృద్ధి బాధ్యత
మూసీ వరదల నేపథ్యంలో 1920లో 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ మూసీ నదిపై గండిపేట సమీపంలో ఉస్మాన్ సాగర్ (గండిపేట చెరువు)ను నిర్మించారు. నగరాన్ని వర్షాకాలంలో వచ్చే వరదల నుంచి కాపాడటానికి, నగరవాసులకు తాగునీటి కోసం ఈ జలాశయాన్ని అప్పటి ప్రముఖ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సాంకేతిక సహకారంతో ఆధునిక ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మించారు. నగరానికి తాగునీరును అందిస్తూ, వరదలను అడ్డుకుంటున్న గండిపేట జలాశయం 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గండిపేటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యతను హెచ్ఎండీఏకు అప్పగించింది.
గండిపేట చెరువును పూర్తి స్థాయిలో పరిరక్షించడంతో పాటు చుట్టూ 46 కి.మీ మేర వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లను నిర్మించాలని ప్రతిపాదించారు. ఇప్పటికే గండిపేట లేక్ వ్యూ పార్కును రూ.36 కోట్లతో నిర్మిస్తే, దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. అదే స్థాయిలో గండిపేట చుట్టూ సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉండగా, చెరువు కింద భాగంలో ఉన్న 70 ఎకరాలను సైతం అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు ఈ 70 ఎకరాల స్థలాన్ని జీవ వైవిధ్యంతో కూడిన పార్కుగా తీర్చిదిద్దాలని ప్రాథమికంగా నిర్ణయించారు.