హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎకోటౌన్ పేరుతో భారీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తుగ్లక్ చర్య అని బీఆర్ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేశ్ విమర్శించారు. స్థానికుల అభిప్రాయాలు సేకరించకుండా, కమీషన్ల కోసమే జపాన్ కంపెనీకి 494 ఎకరాల విలువైన భూమిని కట్టబెట్టారని ఆరోపించారు.
రీజనల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్) పరిధిలో ఇలాంటి ప్రాజెక్టును తీసుకురావడంతో చుట్టుపకల ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో పార్టీ నేతలు ధర్మేందర్రెడ్డి, వెంకటేశ్తో కలిసి మీడియాతో మల్లేశ్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని అందిస్తున్న రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి డంపింగ్ యార్డులు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
విలువైన 494 ఎకరాల భూమిలో ఐటీ కంపెనీలు ఏర్పాటుచేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలి’ అని డిమాండ్ చేశారు. మూసీకి సమీపంలో డంపింగ్ యార్డు ప్రతిపాదించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. వర్షాలు కురిసినప్పుడు ఈ యార్డ్ నుంచి వచ్చే మురుగు నేరుగా మూసీలోకి చేరుతుందని, అలాంటప్పుడు మూసీని ఎలా ప్రక్షాళన చేస్తారని ప్రశ్నించారు. తాము మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, ప్రజలను ఇబ్బందులకు గురిచేసే పనులను సహించమని హెచ్చరించారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీకి ఇకడి ప్రజల కష్టాలు, కాలు ష్య ముప్పు కనిపించడం లేదా? అని క్యామ మల్లేశ్ ప్రశ్నించారు. కేవలం కమీషన్ల కోసమే వారు నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికైనా స్పందించి ఈ డంపింగ్ యార్డ్ను అడ్డుకోకపోతే, ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజల తరఫున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా నిలబడి ఈ డంపింగ్ యార్డ్ ను అడ్డుకుంటామని హెచ్చరించారు.