కేపీహెచ్బీ కాలనీ, జనవరి 5 : జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు నిర్దేశించిన ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యాన్ని వందశాతం సాధించే దిశగా కూకట్పల్లి జోన్ రెవెన్యూ యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆస్తిపన్ను వసూళ్లపై ఇన్నాళ్లు దృష్టిసారించని అధికారులు వార్షిక యేడాది గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టినిసారించారు. ఎర్లీబర్డ్ ఆఫర్లో భారీగా పన్నులు వసూైళ్లెన తదనంతరం ఆస్తిపన్ను వసూళ్లు నెమ్మదించాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఆస్తిపన్ను బకాయిదారులను గుర్తిస్తూ సకాలంలో పన్నులు చెల్లించాలని ఆదేశాలను జారీ చేస్తున్నారు. జోనల కమిషనర్ ఆధ్వర్యంలో సర్కిళ్ల ఉప కమిషనర్లు, రెవెన్యూ అధికారులు వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఆస్తిపన్నుల వసూళ్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. వసూళ్ల లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకునేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు.
కూకట్పల్లి జోన్ పరిధిలో మూసాపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్ సర్కిళ్లు ఉన్నాయి. ఈ వార్షిక యేడాది లక్ష్యం ఐదు సర్కిళ్లలో కలిపి రూ.346.95 కోట్లు వసూళ్లు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.215.50 కోట్లు వసూళ్లు కాగా ఇంకా రూ.131.45 కోట్లు వసూళ్లు చేయాల్సి ఉంది.
జోన్ పరిధిలో నిర్దేశించిన ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే మొండి బకాయిదారులను గుర్తించి జీహెచ్ఎంసీ, రెవెన్యూ చట్టం ప్రకారం రెడ్ నోటీలను జారీ చేస్తున్నారు. ఫోన్లు, ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారాన్ని అందిస్తూ సకాలంలో స్పందించాలని కోరుతున్నారు. లేకుంటే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరికలు చేస్తున్నారు. మరోవైపు సర్కిళ్ల వారీగా ఉపకమిషనర్ల ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బందికి నెలవారీ, రోజువారీ లక్ష్యాలను నిర్దేశించారు. దీనిలో భాగంగా జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో జనవరిలో రూ.43.88 కోట్ల ఆస్తిపన్నులను వసూళ్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా రెవెన్యూ సిబ్బంది బకాయిదారుల ఇంటికి వెళ్లి వెంటనే పన్నులు చెల్లించాలని కోరుతున్నారు. లేని పక్షంలో చట్టరీత్యా ఆస్తులను జప్తు చేయాల్సి వస్తుందని హెచ్చరికలు చేస్తున్నారు.
సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్తులు కావాలని కోరుతున్నాం. జోన్ పరిధిలో ఐదు సర్కిళ్లకు నిర్దేశించిన ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యాన్ని వందశాతం చేరుకునేలా కృషి చేస్తున్నాం. ఎన్నికలు ముగిసిన తర్వాత ఉప కమిషనర్లు, రెవెన్యూ సిబ్బందితో సమావేశాలు నిర్వహిస్తూ రోజువారీ లక్ష్యాలను నిర్దేశించడం జరిగింది. మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేస్తున్నాం. ఈ నెల లక్ష్యాన్ని సాధించడంతో పాటు వార్షిక యేడాది లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాం. జీహెచ్ఎంసీ సిబ్బందికి బకాయిదారులు సహకరించి వెంటనే పన్నులు చెల్లించాలని కోరుతున్నాం.
– వి.మమత, జోనల్ కమిషనర్, కూకట్పల్లి జోన్