రూ. 20 కోట్ల నిధులతో కూకట్పల్లి రామాలయం పునః నిర్మాణ పనులు పూర్తి
నేటి నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు
25న సీతారామచంద్రస్వామిల విగ్రహ ప్రతిష్ఠ
బాలానగర్, ఏప్రిల్ 19 : జైనుల కాలంలో నిర్మించిన కూకట్పల్లి రామాలయానికి శతాబ్దాల ఘనచరిత్ర ఉన్నది. ఆలయంలో నెలకొని ఉన్న శిలా శాసనాల ద్వారా ఇంతటి చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. 436 ఏండ్ల చరిత్ర కలిగి ఉన్న రామాలయ ప్రతిష్టను నగరం నలుమూలలా చాటి చెప్పేందుకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కంకణం కట్టుకున్నారు. సొంత నిధులతో పాటు దాతల సహకారంతో రూ. 20. కోట్ల నిధులతో ఆలయ పునః నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశారు. సీతారామచంద్ర స్వామిల విగ్రహాల పునః ప్రతిష్ఠా మహోత్సవానికి ఆలయం ముస్తాబైంది. దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న ఈ ఆలయాన్ని పునః నిర్మించగా..ఆలయ గోపురం నగరంలోనే అత్యంత ఎత్తైన రాజగోపురంగా ప్రసిద్దికెక్కింది.
ఆలయ చరిత్ర ఇది..
కూకట్పల్లి గ్రామం పచ్చటి పొలాలు, దేవాలయాలతో విరాజిల్లుతుండేది. ఇక్కడి రామాలయంలో నగరంలో ఎక్కడాలేని విధంగా లక్ష్మణ, భరత శత్రఘ్నలతో కలిసి పట్టాభిశక్తుడైన శ్రీసీతారామచంద్ర స్వామి కొలువై ఉండడం విశేషంగా భావిస్తారు. రామాలయం 1969లో దేవాదాయ, ధర్మాదాయశాక శాఖ ఆధీనంలోకి వెళ్లింది. 1985లో శ్రీత్రిదండి రామానుజ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆలయ ప్రాగంణంలో ఆండాళ్ అల్వారాచార్యుల దివ్య సన్నిధి, మహాలక్ష్మి సన్నిధి నిర్మాణం జరిగింది.
నేటి నుంచి పునః ప్రతిష్ఠా మహోత్సవాలు
ఈ నెల 20 నుంచి 26 తేదీ వరకు ఆలయ పునః ప్రతిష్ఠా మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. 20 నుంచి 24 వరకు ప్రత్యేక పూజా పూజలు, హోమాలు, కోలాటాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, కార్యక్రమాలు చేపట్టనున్నారు. 25వ తేదీ శ్రీత్రిదండి రామానుజ చినజీయర్ స్వామి వారితో విగ్రహ ప్రాణప్రతిష్ఠ, దిష్టికుంభ, కుంభప్రోక్షణ, సర్వ దర్శనం, శ్రీసీతారామచంద్రస్వామి శాంతి కల్యాణ మహోత్సవం నిర్వహించానున్నారు. 26న సీతారామచంద్రస్వామి మహాపట్టాభిషేకం, పండిత సన్మానం కార్యక్రమాలు జరుగనున్నాయి. అనంతరం స్వామివార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
అంకురార్పణ జరిగిందిలా…
2016లో ఎమ్మెల్యే కృష్ణారావు తండ్రి మాధవరం నారాయణరావు స్వర్గస్తులు కావడం వల్ల దశదినకర్మ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఓరోజు ఆలయం ప్రాంగణంలో నిద్రించారు. ఆ సమయంలో ఆలయంలో సరైన సదుపాయాలు లేకపోవడం ఆయనను ఎంతగానో బాధించింది. వెంటనే ఆయన ఆలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ తరాలకు గుర్తిండి పోయేలా రామాలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడువుగా.. కొద్ది రోజులకే ఆలయ పునః నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడం కోసం దేవాదాయశాఖ అధికారులు, గ్రామ పెద్దలు, పూజారులతో చర్చించారు. వారి సూచనలు సలహాల మేరకు పనులకు శ్రీకారం చుట్టారు. ఆలయ గోపురం నిర్మాణానికి దేవాదాయ శాఖ అధికారులతో రూ. 10 కోట్లతో ప్రణాలిక సిద్ధం చేశారు. సొంత నిధులు రూ. 2 కోట్లతో పాటు దాతల సహకారంతో గోపురం, కోనేరు, 18 అడుగుల టేకు తలుపులు తయారు చేయించారు. అదేవిధంగా గర్భాలయాన్ని కూడా పునఃనిర్మించాలనే ఆకాంక్షతో ఆలయ నిర్మాణానికి మరిన్ని (నిర్మాణ ఖర్చులో సగం) నిధులు ఎమ్మెల్యే కృష్ణారావు వెచ్చించడం విశేషం.
భగవత్ సంకల్పంతోనే ఆలయ నిర్మాణం
భగవంతుని సంకల్పంతోనే రామాలయం నిర్మాణానికి నా చేతుల మీదుగా నాంది పడింది. ఆ శ్రీరామ చంద్రుడే నాకు ఆ భాగ్యం కల్పించాడు. ఇతంటి అదృష్టం లభించడం నాకు సంతోషంగా ఉంది. కూకట్పల్లి రామాలయం నగరానికి తలమానికంగా రూపుదిద్దడం జరిగింది. భగవంతుడి మీద నాకు ఉన్న భక్తి ప్రపత్తులు… భగవంతుని ఆశీర్వాదం నన్ను ఆలయ పునః నిర్మాణానికి ముందుకు నడిపించాయి. దాతలు, ప్రజల సహకారంతో ఆలయ పునః నిర్మాణం పూర్తి చేయగలిగాం. కూకట్పల్లి రామాలయం చరిత్రలో నిలిచి పోయేలా వేడుకలు జరుపదలిచాం. ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
– మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి ఎమ్మెల్యే