బాలానగర్ : కూకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ పరిధి హస్మత్పేట బోయిన్చెరువు మత్తడి వద్ద రూ. 1.19కోట్ల నిధులతో చేపట్టిన వంతెన నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. ఈ పనులు పూర్తి అయితే ముంపు సమస్యకు చెక్ పడినట్లేనని చెప్పవచ్చు. 2020 అక్టోబర్ నెలలో వచ్చిన అకాల వర్షాల కారణంగా హస్మత్పేట అబ్రార్నగర్, అంజయ్యనగర్ వాసులతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. ముంపు సమస్యకు చెక్ పెట్టడానికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో డివిజన్ కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్లు వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి జిల్లా కలెక్టర్తో ప్రత్యేకంగా చర్చించి చెరువు మత్తడి వద్ద వంతెన నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు కేటాయింపజేశారు. హస్మత్పేటలో చేపట్టిన వంతెన పనులు మరో పక్షం రోజుల్లో పూర్తి కానున్నాయి. వంతెన కు స్లాబ్ పనులు పూర్తి కాగా ఇరువైపుల ర్యాంపు పనులు చేపట్టాల్సి ఉంది. ఆయా ర్యాంపు పనులు పూర్తి అయితే ముంపు సమస్యకు చెక్ పెట్టడంతో పాటు బోయిన్చెరువు ప్రత్యేక అందాలు సంతరించుకోనుంది. వాహనాల రాకపోకలు అధికం కావడంతో పాటు చెరువు కట్ట పర్యాటక కేంద్రంగా విస్తరించనుందని చెప్పవచ్చు.
వంతెన నిర్మాణంతో ముంపు సమస్యకు చెక్
వంతెన పనులు పూర్తి అయితే హస్మత్పేటలోని ప్రాంతాలకు ముంపు సమస్యకు చెక్ పడనుంది. అంతేగాక ఓల్డ్బోయిన్పల్లి నుంచి బోయన్పల్లి మార్కెట్, సికింద్రాబాద్ ప్రాంతాలకు వాహనాల రాకపోకలు సులువుకానున్నాయి. అక్టోబర్ నెల నుంచి ఆగిపోయిన రాకపోకలు ఏప్రిల్ నెల నుంచి కొనాసాగించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. హస్మత్పేటలో చేపట్టిన వంతెన పనులు మరో 15 రోజుల్లో పూర్తి కానున్నాయి. వంతెనకు స్లాబ్ పనులు పూర్తి కాగా ఇరువైపుల ర్యాంపు పనులు చేపట్టాల్సి ఉంది. ఆయా ర్యాంపు పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.