కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 9 : సీఎం కేసీఆర్ ఆశీర్వాదం, ప్రజల దీవెనలతో మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం కూకట్పల్లి ఆర్వో కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్కుమార్తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పదేండ్ల కాలంలో.. తెలంగాణ రాష్ట్రం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిని సాధించిందని.. పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కొనసాగుతుందని.. సీఎం కేసీఆర్ పాలనపట్ల యావత్ ప్రజానికం సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్, తాగునీటి సమస్యలను పరిష్కరించానని.. ఖాళీ స్థలాలను పార్కులుగా, క్రీడా ప్రాంగణాలుగా తీర్చిదిద్దానని, డ్రైనేజీ, రోడ్లను బాగుచేశానని తెలిపారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలతో పాటు.. ఇవ్వని హామీలను కూడా నెరవెర్చినట్లు తెలిపారు. ప్రజలందరికి అందుబాటులో ఉంటూ.. నిరంతరం సేవలందించానన్నారు. కూకట్పల్లిలో ఎమ్మెల్యేగా అందించిన సేవలను గుర్తిస్తూ సీఎం కేసీఆర్ మరోసారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారన్నారు. కూకట్పల్లిలో భారీ మెజార్టీతో విజయం సాధించి సీఎం కేసీఆర్కు కానుకగా అందిస్తానన్నారు. ర్యాలీలో పాల్గొన్న కార్పొరేటర్లు.. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.
కూకట్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు నామినేషన్ ఘట్టం అట్టహాసంగా సాగింది. గురువారం కూకట్పల్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి టి.శ్యాంప్రకాశ్కు మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్కుమార్తో కలిసి నామినేషన్ పత్రాలను అందజేశారు. ముందుగా కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లోని సిద్ధి వినాయక దేవాలయంలో ఎమ్మెల్యే కృష్ణారావు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. కూకట్పల్లి ఆంజనేయస్వామి దేవాలయంలో ఎమ్మెల్యే కృష్ణారావు కుటుంబ సభ్యులు, ఎమ్మెల్సీ నవీన్కుమార్, కార్పొరేటర్లతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
కూకట్పల్లి మసీద్లో మత పేద్దల ఆశీర్వాదం తీసుకుని.. ప్రత్యేక పార్థనలు చేశారు. చివరగా.. కన్నతల్లి ఆశీర్వాదం తీసుకుని.. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ వేశాడు. నామినేషన్ ఘట్టంలో కో-ఆర్డినేటర్ సతీశ్ అరోరా,కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్రావు, పగుడాల శిరీషాబాబురావు, సబీహాబేగం, పండాల సతీశ్గౌడ్, ముద్దం నర్సింహాయాదవ్, ఆవుల రవీందర్రెడ్డి, జూపల్లి సత్యనారాయణ, జిల్లా మైనార్టీటి అధ్యక్షుడు గౌసుద్దీన్, మాజీ కార్పొరేటర్లు కాండూరి నరేంద్రాచార్య, పగుడాల బాబురావు, తూము శ్రవన్కుమార్, ఆయా డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యనేతలు ఉన్నారు.