సిటీబ్యూరో/ చార్మినార్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం చార్మినార్లో సందడి చేశారు. చార్మినార్కు కూతవేటు దూరంలో ఉండే ప్రసిద్ధ ‘నిమ్రా కేఫ్ అండ్ బేకరీ’ని సందర్శించారు. స్థానికులు, పర్యాటకులతో కిక్కిరిసిపోయే నిమ్రా కేఫ్కు కేటీఆర్ రావడంతో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. కేఫ్కు వచ్చిన ఆయనకు స్థానికులు, పార్టీ శ్రేణులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేఫ్లో కేటీఆర్ ఇరానీ చాయ్..ఉస్మానియా బిస్కెట్ల రుచిని ఆస్వాదించారు.
అక్కడి సిబ్బందితో ముచ్చటించి కేఫ్ ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు కేఫ్ సందర్శనకు వచ్చిన కేటీఆర్కు నిమ్రా బేకరీ అధినేత, యువ పారిశ్రామికవేత్త అస్లాం బిన్ అబూద్ సాదర స్వాగతం పలికారు. పాతబస్తీ సంస్కృతి ఉట్టిపడేలా తమకు ఎంతో అప్యాయంగా ఆతిథ్యం ఇచ్చినందుకు అస్లాం బిన్ అబూద్తో పాటు కేఫ్ సిబ్బంది అందరికీ కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మొత్తంగా కేటీఆర్ రాకతో తమ అభిమాన నేతను చూసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు స్థానిక యువత, పర్యాటకులు పోటీపడ్డారు.

అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ.. కేటీఆర్ అక్కడ కాసేపు గడిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పర్యాటకం బాగా ఉండేదని, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చార్మినార్ను సందర్శించేవారని నిమ్రా బేకరీ అధినేత, యువ పారిశ్రామికవేత్త అస్లాం బిన్ అబూద్ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో వ్యాపారం బాగానే జరిగేదని, కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత గడిచిన రెండున్నరేండ్లుగా పర్యాటకం దెబ్బతిన్నదని, విదేశీయుల రాక బాగా తగ్గిందని అస్లాం బిన్ అబూద్ పేర్కొన్నారు.
కేటీఆర్ వెంట ఆలీ మస్కతీ, పుస్తె శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. కాగా, ఈ సందర్శనను పురస్కరించుకొని కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన అనుభూతిని పంచుకున్నారు. హైదరాబాద్ పాతబస్తీకి వెళ్లినప్పుడు అక్కడి ఇరానీ చాయ్ తాగకపోతే ఆ పర్యటనకు సంపూర్ణత్వమే ఉండదు. చార్మినార్ పక్కనే ఉన్న ప్రముఖ నిమ్రా కేఫ్ను సందర్శించి, ఇక్కడి రుచికరమైన ఉస్మానియా బిస్కెట్లు, ఇరానీ చాయ్ను అస్వాదించానని ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు.