ఖైరతాబాద్, ఏప్రిల్ 14 : బోధించు.. సమీకరించు.. పోరాడు అని ప్రబోధించిన అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నామని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. హైదరాబాద్ పంజాగుట్ట కూడలిలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఆధారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని వివరించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గురుకులాల సంఖ్య 270 నుంచి 1,001కి పెరిగిందని, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 6 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. దళితబంధు లాంటి పథకం దమ్మున్న నాయకుడు కేసీఆర్తోనే సాధ్యమవుతుందని స్పష్టంచేశారు.
పంజాగుట్ట కూడలిని బీఆర్ అంబేద్కర్ చౌరస్తాగా నామకరణం చేస్తున్నామని, జీవోను వెంటనే విడుదల చేస్తామని ప్రకటించారు. పంజాగుట్ట వేదిక ద్వారా పార్లమెంట్కు సైతం అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని వివరించారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్రావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, సైదిరెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేషన్ల చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, కే విప్లవ్కుమార్, కార్పొరేటర్లు వనం సంగీత యాదవ్, మన్నె కవిత తదితరులు పాల్గొన్నారు.
దళితులకు గౌరవాన్ని తీసుకొచ్చి హైదరాబాద్తో అంబేద్కర్కు ఉన్న అనుబంధాన్ని గుర్తించిన ఏకైన ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనకు దళిత సమాజం తరఫున కృతజ్ఞతలు. దళితులంతా కేసీఆర్వైపే ఉంటారు. దళితులకు గౌరవాన్ని తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే.
– గంధం రాములు, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
సకలజన బాంధవుడు కేసీఆర్
అంబేద్కర్లాగే సమసమాజ నిర్మాణానికి పాటుపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. సంక్షేమ ఫలాలను పేదలకు అందజేయడంలో ముఖ్యమంత్రి దేశంలోనే నంబర్ వన్గా ఉన్నారు. తెలంగాణ సమాజం కేసీఆర్కు అండగా నిలుస్తుంది.
– రణం జ్యోతి, దౌల్తాబాద్, సిద్దిపేట జిల్లా
దేశమంతా మురువాలె
అంబేద్కర్ మహా విగ్రహాన్ని దేశంలో ఎక్కడా చూడలేదు. దేశమంతా ఈ మహాద్భుత విగ్రహాన్ని చూసు మురిసిపోవాల్సిందే. బాబాసాహెబ్ మూర్తిమత్వం ఉట్టిపడుతున్నది. తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
– కాన్షీరాం, చింతల్బస్తీ, ఖైరతాబాద్ నియోజకవర్గం
కారణజన్ముడు కేసీఆర్
దేశంలో ఓ వైపు కొందరు ప్రజలను విభజిస్తుంటే.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షిస్తున్నారు. మహిళల హక్కులను, అణగారిన వర్గాల హక్కులను కాపాడుతున్న కారణజన్ముడు కేసీఆర్ సార్. కేసీఆర్ పాలనలోనే అన్ని వర్గాలకు సమున్నత స్థానం దక్కుతుంది.
– రాజేశ్వరి, సనత్నగర్, నియోజకవర్గం