సిటీబ్యూరో, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ)/మెహిదీపట్నం: టోలిచౌకీ రిలయన్స్ మార్ట్ నుంచి షేక్పేట, రాయదుర్గం ముల్కం చెరువు వరకు దాదాపు మూడు కిలో మీటర్ల మేర నిర్మితమైన ఫ్లై ఓవర్ శనివారం ప్రారంభమవుతుంది. దీంతో ఎంతో మందికి రవాణా సౌలభ్యం కలుగుతుంది. అనాదిగా చోటు చేసుకున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఇంక రాకపోకలకు ఎలాంటి ఇక్కట్లు తలెత్తే అవకాశమే లేదు. ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం ఒకెత్తెయితే, దాని కింద వెలిసిన పార్కు మరో అద్భుతం. బయో డైవర్సిటీ అధికారులు ఫ్లై ఓవర్ కింద రకరకాల మొక్కలను నాటి అద్భుతమైన పార్కును ఏర్పాటు చేశారు. దానికి తోడు వాకింగ్ ట్రాక్, ఫౌంటెయిన్లు, కూర్చునేందుకు పలు రకాల సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. కిందున్న పార్కు గుండా పోయే వారికి సుగంధ పరిమళాలను వెదజల్లుతూ, ప్రాణవాయువును అందిస్తూ ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించనుంది. ఇలాంటి గమ్మత్తైన వాతావరణాన్ని అందించే పార్కు నగరంలో ఇదొక్కటే కావడం గమనార్హం.
సిగ్నల్ ఫ్రీ నగరంగా..
నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన నేపథ్యంలో నగర ప్రజలకు సిగ్నల్ ఫ్రీ నగరంగా ప్రసిద్ధి పొందేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి (ఎస్ఆర్డీపీ) పథకంలో భాగంగా చేపట్టిన మరో ప్రాజెక్టు నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నది. రూ.333.55 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 2.8 కిలోమీటర్ల పొడవున్న ఫె్లైఓవర్ నగరంలో అతి పెద్దదిగా ఉన్నది. అదే షేక్పేట్ ఫె్లై ఓవర్, నూతన సంవత్సర కానుకగా దీనిని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు కె.తారక రామారావు శనివారం నగరానికి అంకితం చేయనున్నారు. ఈ భారీ ఫ్లై ఓవర్తో నానల్నగర్ నుంచి ఖాజాగూడ, అక్కడి నుంచి ఔటర్ రింగు రోడ్డు వరకు దాదాపు 11 కిలోమీటర్ల మేర సిగ్నల్ ఫ్రీ ప్రయాణం సాధ్యం కానుంది. కోర్ సిటీ నుంచి హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ల వైపు రాకపోకలు సాగించే వారికి భారీ ఉపశమనం లభించనుంది. ఇన్నర్ రింగు రోడ్డు (రేతిబౌలి) నుంచి ఔటర్ రింగు రోడ్డు (గచ్చిబౌలి) వరకు లక్డీకాపూల్, మెహిదీపట్నం, టౌలిచౌకీ, గచ్చిబౌలి మార్గాల్లో ప్రయాణించే దాదాపు 4 లక్షల వాహనదారులకు ఊరట కలగనుంది. బయో డైవర్శిటీ జంక్షన్ -జేఎన్టీయూ జంక్షన్ మార్గానికి అనుసంధానంగానూ ఉన్న ఈ ఫ్లై ఓవర్తో దాదాపు 17 కి.మీల మేర (లక్డీకాపూల్-జేఎన్టీయూ జంక్షన్) సాఫీ ప్రయాణం సాధ్యమని ఈ ప్రాజెక్టు పనులు పర్యవేక్షించిన ఎస్ఈ వెంకట రమణ తెలిపారు.
ఐటీ ఉద్యోగులకు మహా ఊరట
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఐటీ ఉద్యోగులు షేక్పేట మీదుగా హైటెక్ సిటీ వెళ్లాలంటే ఒకప్పుడు నరకం అనుభవించాల్సి వచ్చేది. మెహిదీపట్నం, అత్తాపూర్, లంగర్హౌస్ వైపుల నుంచి వచ్చే వాహనాలు నిత్యం ట్రాఫిక్లో గంటల తరబడి ఇరుక్కుపోయేవి. కాని, ఈ భారీ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ నుంచి విముక్తి లభించినట్లేనని వాహనదారులు పేర్కొంటున్నారు.
ఫ్లై ఓవర్ కింద తొలి పార్కు
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మొదటిసారిగా ఫ్లై ఓవర్ కింద ప్రత్యేక పార్కును జీహెచ్ఎంసీ అర్బన్ బయో డైవర్శిటీ విభాగం అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పార్కులో వాకింగ్ ట్రాక్, కూర్చోవడానికి సిట్టింగ్ సౌకర్యాన్ని కల్పించారు. ఇదే కాకుండా ఆకర్షణీయంగా వాటర్ ఫౌంటెయిన్ ఏర్పాటు చేశారు. ఫ్లై ఓవర్ కింద నుంచి వెళ్లే వాహనదారులకు చక్కటి ప్రాణ వాయువు అందించడానికి రకరకలా పూల మొక్కలను నాటారు. ఫ్లై ఓవరు ప్రారంభం, ముగింపు భాగాన ఉన్న ర్యాంపుల వద్ద ఈ వాకింగ్ పార్కు పనులను రూ.3 కోట్ల వ్యయంతో దాదాపు 600 మీటర్లకు పైగా ట్రాక్ ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ పంచే దాదాపు 38 వేల రకాల మొక్కలను ఇక్కడ నాటారు. ఈ పార్కులో నడవటం ద్వారా ఫిట్నెస్తో పాటు స్వచ్ఛమైన ఆక్సిజన్ ఆస్వాదించి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు వీలవుతుందని అధికారులు తెలిపారు. కాలుష్య నియంత్రణ, ఉష్ణోగ్రతను తగ్గించడం, నగర సుందరీకరణ పెంపొందించడం కోసం వివిధ ఫ్లై ఓవర్ల కింద వర్టికల్ గార్డెన్లు, ఆకర్షణీయమైన మొక్కలను నాటుతున్నట్లు జీహెచ్ఎంసీ అర్బన్ బయో డైవర్శిటీ విభాగం అడిషనల్ కమిషనర్ కృష్ణ తెలిపారు.