సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ) :మూసీ వెంట మంచిరేవుల నుంచి నాగోల్ వరకు 55 కిలోమీటర్ల మేర రూ. 10 వేల కోట్లతో ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రూ.41 కోట్లతో కోకాపేటలో 15 ఎంఎల్డీ సామర్థ్యంతో నిర్మించిన ఎస్టీపీని, రూ.29.50 కోట్లతో హెచ్ఎండీఏ నిర్మించిన ఇంటర్చేంజ్ను శనివారం మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మూసీ నదిపై 14 కొత్త వంతెనలు నిర్మిస్తామని చెప్పారు. ఔటర్ వెంట సోలార్ రూఫ్తో ఆగస్టు 15 నాటికి సైక్లింగ్ ట్రాక్ అందుబాటులోకి తేస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బీహెచ్ఎఈఎల్ నుంచి కందుకూరు వరకు మెట్రోను విస్తరిస్తామన్నారు. సెప్టెంబర్ నాటికల్లా వంద శాతం మురుగునీటి శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ చరిత్ర సృష్టించనున్నదని తెలిపారు.
పది వేల కోట్లతో మూసీ వెంట మంచిరేవులు-నాగోల్ వరకు 55 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి రూ. 10వేల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మూసీ నది అభివృద్ధికి వినూత్న ప్రణాళికలు రూపొందిస్తున్నామని, త్వరలో మూసీపై 14 బ్రిడ్జిల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఔటర్ వెంట సోలార్ రూఫ్తో సైక్లింగ్ ట్రాక్ నిర్మాణం జరుగుతున్నదని, ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తేస్తామన్నారు. ఏ మెట్రో నగరంలో లేని విధంగా సెప్టెంబర్ నాటికల్లా వంద శాతం మురుగునీటి శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ చరిత్ర సృష్టించనున్నదని తెలిపారు. శనివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్లతో కలిసి రూ. 41 కోట్లతో కోకాపేటలో 15 ఎంఎల్డీ సామర్థ్యంతో నిర్మించిన ఎస్టీపీని, రూ.29.50 కోట్లతో హెచ్ఎండీఏ నిర్మించిన ఇంటర్చేంజ్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ. 3,866 కోట్లతో 31 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీ)ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, అందులో మొదటిది కోకాపేట 15 ఎంఎల్డీ సామర్థ్యంతో ఎస్టీపీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. వంద శాతం మురుగునీటి శుద్ధికి నిర్వీరామంగా కృషి చేస్తున్న జలమండలి ఎండీ దానకిశోర్, ఈడీ సత్యనారాయణ, అధికారుల బృందాన్ని అభినందించారు.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగు రోడ్డు ఎంతో ఉపయుక్తంగా ఉందని, ఔటర్ చుట్టూ పెరుగుతున్న జనసాంద్రతను దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని, మరికొన్ని ఇంటర్చేంజ్లను నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. త్వరలో ఔటర్పై 21వ ఇంటర్చేంజ్ మల్లంపేట వద్ద అందుబాటులోకి వస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సర్వీస్ రోడ్లను 4 లేన్లతో విస్తరించనున్నట్లు తెలిపారు.రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో పనులను రాబోయే రెండున్నరేండ్లలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బీహెచ్ఎఈఎల్ నుంచి కందుకూరు వరకు మెట్రోను విస్తరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్, హెచ్ఎండీఏ డైరెక్టర్ ప్రభాకర్, చీఫ్ ఇంజినీర్, హెచ్జీసీఎల్ ఎండీ బీఎల్ఎన్ రెడ్డి, ప్లానింగ్ డైరెక్టర్ బాలకృష్ణ, సీజీఎం రవీందర్, ఎస్ఈలు హుస్సేన్, పరంజ్యోతి, నార్సింగి ఇంటర్చేంజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
20 చోట్ల ఇంటర్ చేంజ్లు..
హైదరాబాద్ మహానగర రోడ్డు రవాణా వ్యవస్థలో ఔటర్ రింగు రోడ్డు అత్యంత కీలకంగా మారింది. ముఖ్యంగా గ్రేటర్ చుట్టూ 158 కి.మీ మేర ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై 20చోట్ల
ఇంటర్చేంజ్లు అందుబాటులోకి వచ్చాయి. మరో రెండు చోట్ల నిర్మాణంలో ఉన్నాయి. భవిష్యత్లో పెరిగి ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని కొత్తగా మరిన్నిచోట్ల ఇంటర్చేంజ్లు నిర్మించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. శనివారం నార్సింగి వద్ద కొత్తగా ప్రారంభించిన ఇంటర్చేంజ్ 20వది కాగా, మరో రెండు ఇంటర్చేంజ్లు కోకాపేట నియోపొలీస్, మల్లంపేట వద్ద నిర్మాణ దశలో ఉన్నాయి.
ఐటీ కారిడార్లోని నానక్రాంగూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు, తిరిగి పోలీస్ అకాడమీ నుంచి కొల్లూరు వరకు రూ. 300 కోట్ల సర్వీసు రోడ్లను ఒక్కో వైపు 2 వరుసల నుంచి
4 లైన్లతో అభివృద్ధి చేస్తున్నారు.