సిటీబ్యూరో, అక్టోబరు 12 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్లో అభివృద్ధి తిరిగి గాడిన పడాలంటే కేసీఆర్ మళ్లీ రావాలని, అది జూబ్లీహిల్స్ నుంచి మొదలు కావాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ షేక్పేట డివిజన్కు చెందిన సీనియర్ నాయకుడు చెర్క మహేశ్కు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు.
అన్ని అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని, ఈ రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా కాంగ్రెస్ చేయలేకపోయిందని మండిపడ్డారు. ఒక్క ఇల్లు కట్టలేదు..ఒక్క ఇటుక పెట్టలేదు..కానీ రూ.2.30 లక్షల కోట్లు అప్పు మాత్రం చేసిందని కేటీఆర్ విమర్శించారు. గరీబోళ్ల ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి బుల్డోజర్లు పంపించి ఇండ్లు కూలగొట్టిస్తున్నాడని రేవంత్రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు.
జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా? బుల్జోజరు కావాలా నిర్ణయించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రస్తుతం రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. రెండు సంవత్సరాల్లో సంపాదించిన మొత్తం అవినీతి సొమ్మును జూబ్లీహిల్స్లో ఖర్చు పెడుతారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్లేనని చెప్పారు. జూబ్లీహిల్ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నదని కేటీఆర్ చెప్పారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే నెలకు రూ.4వేల పెన్షన్ వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.