కొంగరకలాన్లో 4వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఫాక్స్కాన్ పరిశ్రమతో స్థానికంగా 35 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తైవాన్కు చెందిన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్కాన్ టెక్నాలజీస్ రంగారెడ్డి జిల్లాకు రావడం చాలా గర్వంగా ఉన్నదని, రానున్న ఐదేండ్లలో కొంగరకలాన్ గుర్తు పట్టలేని విధంగా మారబోతున్నదని చెప్పారు. సోమవారం ఫాక్స్కాన్ పరిశ్రమకు మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు విశేషంగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఓ వైపు ఐటీ, మరో వైపు వ్యవసాయ రంగాలు పురోగమనంలో పయనిస్తున్నాయని మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.
రంగారెడ్డి, మే 15 (నమస్తే తెలంగాణ) : తైవాన్కు చెందిన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్కాన్ టెక్నాలజీస్ రంగారెడ్డి జిల్లాకు రావడం చాలా గర్వంగా ఉందని.. ఈ కంపెనీ యూనిట్ ఏర్పాటుతో స్థానికంగా వేలాది మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని..జిల్లా రూపురేఖలే మారుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఆయన ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని కొంగరకలాన్లో ఫాక్స్కాన్ కంపెనీ ఏర్పాటుకు మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కిషన్రెడ్డి, కంపెనీ చైర్మన్ యాంగ్ లియూతో కలిసి భూమి పూజ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఫాక్స్కాన్ రంగారెడ్డి జిల్లాకు రావడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. రానున్న ఐదేండ్లలో కొంగరకలాన్ గుర్తు పట్టలేని విధంగా మారుతుందని.. రూ.నాలుగు వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఫాక్స్కాన్ పరిశ్రమతో స్థానికంగా 35 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి అన్నారు. మన చేరువలోకి వచ్చిన పరిశ్రమలను కాపాడుకోవాలని సూచించారు. స్థానిక యువతీకువకులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని ఫాక్స్కాన్ యాజమాన్యం హామీ ఇచ్చినట్లు తెలిపారు. పరిశ్రమ నిర్మాణం జరుగుతుంటే మరోవైపు యువతకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నట్లు చెప్పారు. యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. తొమ్మిదేండ్లలోనే తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. దేశంలోనే స్వచ్ఛ సర్వేక్షణ్లోని 26 అవార్డులు తెలంగాణ సాధించిందని వెల్లడించారు. ఓ వైపు ఐటీ, మరో వైపు వ్యవసాయ రంగాలు పురోగమనంలో పయనిస్తున్నాయని అన్నారు. నల్లా ద్వారా ఇంటింటికీ తాగునీళ్లు ఇచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ ప్రసిద్ధి గాంచిందని, కేంద్రం ఇక్కడి సంక్షేమ పథకాలను కాపీ కొడుతున్నదని ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితా హరినాథ్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, రంగారెడ్డి జిల్లా రైతు బంధు చైర్మన్ వంగేటి లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకట రమణారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర యువనాయకులు మంచిరెడ్డి ప్రశాంత్రెడ్డి, జిల్లా సహకార సంఘం చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి, వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంపీపీలు కృపేశ్, నర్మద, జడ్పీటీసీ జంగమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, వైస్చైర్మన్ కల్వకోలు రవీందర్రెడ్డి, ఆదిబట్ల వైస్ చైర్మన్ కొర్రె కళమ్మ, కోఆప్షన్ సభ్యులు పల్లె గోపాల్గౌడ్, కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కొలువుల తెలంగాణ కావాలి..
మనకు కొలువుల తెలంగాణ కావాలి కానీ.. మత పిచ్చి తెలంగాణ వద్దని మంత్రి కేటీఆర్ నినదించారు. విదేశాల నుంచి పెట్టుబడులు రావడం వల్ల స్థానికంగా పరిశ్రమలు వెలుస్తుండటంతో స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయన్నారు. ఐదేండ్ల తరువాత కొంగరకలాన్ గుర్తు పట్టలేనంతగా మారుతుందన్నారు. నటుడు రజనీకాంత్ హైదరాబాద్ నగరం అమెరికాలోని న్యూయార్క్ను తలపిస్తున్నదని పేర్కొన్నట్లు మంత్రి గుర్తు చేసుకున్నారు. స్థానిక నిరుద్యోగులు, యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు వివరించారు.
భవిష్యత్తులో హైటెక్ సిటీని మించి..
విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి
రానున్న రోజుల్లో హైటెక్సిటీని మించి రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్ గ్రామం అభివృద్ధి చెందడం ఖాయమని మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఫాక్స్కాన్ కంపెనీ జిల్లాకు రావడానికి కారకులైన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు జిల్లా ప్రజల తరఫున ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామ రక్ష అని.. ఆయన తలపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మనమంతా అండగా నిలుద్దామని మంత్రి సభాముఖంగా కోరారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కమిట్మెంట్ ఉన్న నేత అని.. ఆయన కృషితోనే రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని కొనియాడారు.
ఇబ్రహీంపట్నంకు మరిన్ని పరిశ్రమలు
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
ఆదిబట్ల, మే 15 : భవిష్యత్తులో నియోజకవర్గ రూపురేఖలు మారనున్నాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం కొంగరకలాన్ వద్ద ఫాక్స్కాన్ కంపెనీ భూమిపూజా కార్యక్రమం అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధిని సాధించిందన్నారు. ఎన్నో ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటైనట్లు తెలిపారు. త్వరలోనే ఎలిమినేడు గ్రామంలో ఏరోస్పేస్, బలిజగూడలో కార్ల తయారీ పరిశ్రమ, ఆదిబట్లలో ఎల్ఎంటీ సంస్థ ఆధ్వర్యంలో పలు పరిశ్రమలు ఏర్పాటు కానున్నట్లు చెప్పారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన భూములు ఉన్నాయన్నారు. వేలాది మంది స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయని చెప్పారు.