హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నేతలతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులతో తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. మంగళవారం జరుగనున్న గ్రేటర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం, జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నద్ధతపై చర్చించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్లకు వివిధ అంశాలపై కేటీఆర్ మార్గదర్శనం చేశారు. పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఎలాంటి అవినీతికి తావు లేకుండా అద్భుతంగా పదవీకాలం పూర్తి చేసుకోబోతున్నారని పార్టీ తరపున వారికి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా రెండోసారి జీహెచ్ఎంసీలో గెలిచిన తర్వాత కరోనా వంటి తీవ్ర సంక్షోభంలోనూ అద్భుతమైన సేవలను అందించిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రజలు పార్టీకి ప్రతిపక్షంగా బాధ్యత ఇచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఉన్న కార్పొరేటర్లు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేసిన తీరును అభినందించారు. మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు బాధ్యతాయుతంగా ఎన్నికలను పోరాడిన విధానంపై అభినందనలు తెలిపారు.
పార్టీ వెంటే నిలబడిన ప్రతి ఒక్క కార్పొరేటర్కి భవిష్యత్తులో మరిన్ని పదవులు వస్తాయని హామీ ఇచ్చారు. కార్పొరేటర్లు భవిష్యత్తులో జరిగే ఎన్నికను తమ ఎన్నికగా తీసుకొని పార్టీ అందరినీ తిరిగి గెలిపించుకుంటుందని భరోసా ఇచ్చారు. కార్పొరేటర్లకి రానున్న కాలంలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సిద్ధంగా ఉండాలని సూచించారు. కౌన్సిల్ సమావేశంలో బల్దియాలోని సమస్యలు ప్రస్తావించాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పారిశ్రామిక భూముల అమ్మకంపై నిలదీయాలని సూచించారు.