ఆ రెండు పార్టీలది ఫెవికాల్ బంధం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొంటే కుక్క తోకను పట్టుకొని గోదారి ఈదినట్లే. అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తుంది. అది దాని నైజం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ మంచి అవగాహనతో పని చేస్తున్నాయి. ఆ రెండు పార్టీలది ఫెవికాల్ బంధం.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR | జూబ్లీహిల్స్, జనవరి 27 : అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ అఖండ మెజార్టీతో జయకేతనం ఎగురవేసిందని, అదే మాదిరిగా రానున్న లోక్సభ ఎన్నికల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. యూసుఫ్గూడ మహమూద్ ఫంక్షన్హాల్లో శనివారం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అధ్యక్షతన జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో మొదటి నుంచి సరైన వ్యూహాన్ని రూపొందించుకుంటే బ్రహ్మాండమైన మెజార్టీ సాధిస్తామన్నారు. ఆరు గ్యారెంటీలతోపాటు ప్రాతిపదికలేని 420 హామీలు ప్రకటించి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని అన్నారు. అంబర్పేట అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడనే సానుభూతితో ఎంపీగా గెలిచిన కిషన్రెడ్డి కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్, జూబ్లీహిల్స్కు ఒక్క పనైనా చేసిండా? అని ప్రశ్నించారు.
ఈసారి ఎన్నికల్లో కిషన్రెడ్డికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. బీజేపీ వాళ్లు ఎంతసేపు దేవుడు పేరు చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తారని విమర్శించారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, అందుకే ప్రజలు ఆయన్ని ప్రియమైన ప్రధాని అని కాకుండా పిరమైన ప్రధానిగా అభివర్ణిస్తారని అన్నారు. చట్ట సభల్లో తెలంగాణ గళం వినిపించాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించాలని కేటీఆర్ అన్నారు.
తెలంగాణలో అభివృద్ధి సాధించేందుకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం తప్పనిసరని, అందుకే బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో విజయం సాధించేలా ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాల ప్రకాశ్, సొహైల్ భాయ్, కార్పొరేటర్లు రాజ్కుమార్ పటేల్, దేదీప్యరావు విజయ్, వనం సంగీత యాదవ్, డివిజన్ అధ్యక్షులు సంతోష్ ముదిరాజ్, ప్రదీప్ కుమార్, కృష్ణమోహన్, డివిజన్ నాయకులు విజయ్కుమార్, కో ఆర్డినేటర్ విజయసింహారెడ్డి, నర్సింహారెడ్డి, బసవరాజు,నజీర్, డాక్టర్ అఫ్తాబ్, రామకృష్ఱ, షరీఫ్, జావీద్, బషీర్, నర్సింగ్ దాస్, మధు యాదవ్, వేణు, అరుణ్, రాకేశ్, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహిళలే పార్టీకి పట్టుగొమ్మలు..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి మహిళలే పట్టుగొమ్మలు. ఎన్నికలు ఏవైనా కష్టపడి పార్టీని గెలిపించిన ఘనత వారికే దక్కుతుంది. అధికారంలో లేకున్నా ఎల్లవేళలా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు పాటుపడుతున్న కార్యకర్తలకు అండగా ఉంటా. గత పార్లమెంట్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్కు ఎక్కువ మెజార్టీ వచ్చింది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలి.
– ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, జూబ్లీహిల్స్
కాంగ్రెస్పార్టీ మోసానికి మారుపేరు
కాంగ్రెస్ పార్టీ మోసానికి మారుపేరు. ఐదు దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే ఒక్కరోజులో నా కుటుంబానికి విలువ లేకుండా చేశారు. నా రాజకీయ జీవితం ముగిసిందనుకున్న దశలో కేసీఆర్ పిలిచి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. అందుకు బీఆర్ఎస్ పార్టీకి నమ్మకంగా ఉంటా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా కనపడొద్దు అదే కసితో పని చేస్తా.
– మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి